పెళ్లి సంబంధాలను సమకూర్చే సంస్థలు, మ్యారేజ్ బ్యూరోలు బోలెడు తయారయ్యాయి. ఈ బ్యూరోల ద్వారా సంబంధాలు వెతుక్కునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అడ్డంగా బుక్కయిపోతారు. ఇలాంటి ఘటన తెనాలి త్రీ టౌన్ పరిధిలో జరిగిన సంఘటన కలకలం రేపింది. పట్టణంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళకు, కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. వంశీ తనకు గతం వివాహం అయ్యి.. విడాకులు కూడా అయ్యాయని, తిరిగి వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నానని నమ్మబలికాడు.
అంతేకాదు ఆ మహిళ పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి కలవడం.. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో వారు వంశీ మాటలను నమ్మారు. ఇదే అదునుగా భావించిన వంశీ టిప్పర్ కొనుగోలు చేయాలని.. డబ్బు అవసరమని చెప్పి, సదరు మహిళ నుంచి వివిధ మార్గాల్లో లోన్స్ తీసుకునేలా ప్రేరేపించాడు. అలా ఆమె వద్ద నుంచి 12 లక్షల 20 వేల రూపాయలు తీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి.. చనువుగా ఉండటంతో ఆమె కాబోయే భర్తే కదా అనుకుంది. ఈ క్రమంలోనే వంశీ మరికొంత డబ్బు కావాలని ఒత్తిడి చేశాడు. డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఆమెపై దాడి చేసి అసభ్యకర పదజాలంతో దూషించి, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. అంతేకాకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేస్తానని, చంపుతానని బెదిరించినట్లు మహిళా ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టుకు హాజరు పరిచినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు. వంశీపై తెనాలిలో ఒక కేసు ఉందని, ఇవి కాక మరి కొంతమంది మహిళలు మోసపోయినట్లుగా సెల్ఫోన్లో ఉన్న మెసేజ్ల ద్వారా తెలిసినట్లు సిఐ చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వంశీపై చర్యలు తీసుకుంటామన్నారు.
Also read
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
- ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
- ఛీ.. ఛీ.. అసలు నువ్వు తల్లివేనా.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో..
- వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..





