పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.
రూ.50 లక్షలు విలువచేసే బంగారం స్వాధీనం
పెనుకొండ(అనంతపురం): పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు. ఇలా మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో 27 ఇళ్లలో చోరీలు చేశారు. ఆఖరుకు పోలీసులు.. ఆ ముఠా ఆట కట్టించారు. కర్ణాటక(Karnataka)లోని తుమకూరు జిల్లా పావగడ తాలూకా జుజురాయనహళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి రూ.50 లక్షలు విలువ చేసే 27తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జుజురాయనహళ్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబం పందుల వ్యాపారం చేస్తుండేది. అందులో నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకున్నారు. ఆ కుటుంబంలోని ఆంజనేయులు, అరుణ్కుమార్, నరేష్, లక్ష్మి, గంగమ్మ, లక్ష్మీదేవమ్మ, యశోదమ్మ, వెంకటరమణమ్మ, నిర్మలమ్మ ముఠాగా ఏర్పడ్డారు.
గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో చోరీలకు పాల్పడేవారు. ఇలా పెనుకొండ, మడకశిర పరిధిలో 2021 నుంచి ఇప్పటి వరకు 27 ఇళ్లలో చోరీలు చేశారు. వీటిపై బాధితులు ఫిర్యాదులు చేశారు. వాటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ముఠాలో ఆంజనేయులు మినహా అందరినీ అరెస్టు చేశారు. ఆంజనేయులును త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ నర్సింగప్ప, సీఐలు రాఘవన్, శేఖర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.

గోరంట్ల పరిధిలో 9 చోరీలు..
హిందూపురంలోని ముక్కడిపేటకు చెందిన నూర్ ముజమ్మిల్ గోరంట్ల ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. 2024నుంచి 2026 వరకు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ చోరీలు చేశాడు. రెండు బైక్లను అపహరించాడు. అతడిని అరెస్టు చేసి, 13 తులాల బంగారం, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.18.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
Also read
- Students protest | నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్
- నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్పై ప్రత్యర్థి ఉండగానే..
- ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ
- నేటి జాతకము..13 ఫిబ్రవరి, 2026
- మహిళలు హనుమంతుడి పాదాలను తాకితే ఏమవుతుంది..? అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..





