SGSTV NEWS online
Andhra PradeshCrime

పోలీసులపై మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాడి

హిందూపురం(సత్యసాయి) : పోలీసులపై మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌ తీవ్రగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు కేసుల్లో నిందితుడైన కావిడి నాగేంద్ర చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో వస్తున్నట్లు సమాచారంతో పోలీసులు శుక్రవారం తెల్లవారుజాముల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాగేంద్ర అకస్మాత్తుగా పోలీసులపై తిరగబడి తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హిందూపురం అప్‌ గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రవి గాయపడ్డారు. ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన రూరల్‌ అప్‌గ్రేడ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులుపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు పోలీసు సిబ్బందిని వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.నిందితుడు అదుపులోకి రాకుండా పోలీసులపై దాడి కొనసాగించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు స్వీయరక్షణార్థం కాల్పులు జరిపినట్లు తెలిసింది. అనంతరం నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాగేంద్ర రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అత్త,కోడలు గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఉండటంతో పాటు, రెండు రాష్ట్రాల్లో కలిపి అతనిపై 90కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Also read

Related posts