SGSTV NEWS online
CrimeTelangana

పదహారేళ్ళ అమ్మాయి.. రెండు పదుల వయసున్న అబ్బాయి.. ప్రాణాలు తీసిన పిచ్చి ప్రేమ!


పదహారేళ్ళ వయసులో అమ్మాయి.. రెండు పదుల వయసున్న అబ్బాయి.. ప్రేమ బంధంతో దగ్గరయ్యారు. కానీ, నాలుగు నెలల పిచ్చి ప్రేమ.. ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్ (20), మైనర్ బాలిక(16) ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాలుగు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన ఇరువురి కుటుంబ పెద్దలు ప్రేమపెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన కుటుంబసభ్యులు, గ్రామస్తుల సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే సోమవారం (జనవరి 05, 2026) రోజు బాలికను సంప్రదించేందుకు మహేష్ ప్రయత్నించాడు. ఆమెకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. లేదంటే మరోసారి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన బాలిక, మనస్తాపంతో మంగళవారం (జనవరి 06) రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి బుధవారం ఉదయం మహేష్ సైతం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Related posts