భార్యను హత్య చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది. శ్రీకాకుళం గౌరవ మొదటి అదనపు న్యాయస్థానం జడ్జి పి. భాస్కరరావు.. జీరు వెంకట రమణ(27) అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు. నేరం జరిగిన ఏడేళ్లకు ముద్దాయికి శిక్ష ఖరారు చేయడం సంచలనంగా మారింది.. అంతకు అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకోండి..
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు వెంకట రమణకు రమణమ్మ (24)అనే మహిళతో గతంలో వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్నేళ్లకే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. రమణమ్మ మరో వరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం వచ్చింది.. ఈ కారణంగా భర్త వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదిగా ఆమె పుట్టింటిలోనే నివసిస్తువచ్చింది. 2018లో జీరు వెంకట రమణ తండ్రి మృతి చెందగా మృతుడి అంత్యక్రియల నిమిత్తం భార్య జీరు రమణమ్మ 2018 మార్చి 14న బాణం గ్రామంలోని భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు సాయంత్రం 17.30 గంటలకు, బాణం గ్రామంలోని ముద్దాయి ఇంటి వద్ద వెంకట రమణకు, అతని భార్య రామణమ్మకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో రమణమ్మ తన భర్తతో కలిసి ఉండనని కుటుంబసభ్యుల సమక్షంలో స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త వెంకటరమణ పదునైన కత్తితో ఆమె మెడపై విచక్షణారహితంగా దాడి చేసాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రమణమ్మ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి వెంకట రమణను అరెస్టు చేశారు.
అనంతరం.. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ముద్దాయి బెయిల్పై విడుదలై.. కొన్ని వాయిదాలకు కోర్టుకి హాజరయ్యాడు.. అనంతరం గత ఐదేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవడంతో జిల్లా మొదటి అదనపు జడ్జి కోర్టు శ్రీకాకుళం వారు ముద్దాయి పై నాన్ బెయిల్ బుల్ వారంట్ జారీ చేశారు.
శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసారు. ముద్దాయి గుంటూరు పట్టణంలో ఉంటున్నట్టు గుర్తించి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తదుపరి కోర్టు… కేసును త్వరితగతిన విచారణ కోసం ట్రయల్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింజరాపు శ్రీనివాసరావు వాదనలు వినిపించగా, కోర్టు ట్రయల్ను వేగవంతంగా పూర్తి చేసింది. తీర్పు ప్రకారం, ముద్దాయి పై నేరాలు పూర్తిగా రుజువు కావడంతో సెక్షన్ 302 IPC,సెక్షన్ 498-A IPC క్రింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 2,000/- జరిమానా విధిస్తూ, గురువారం మొదటి అదనపు జిల్లా జడ్జి పి. భాస్కరరావు తీర్పును వెలువరించారు.
జిల్లాలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి కేసుల్లో చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మహేశ్ తెలిపారు.
Also Read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





