SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..




ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి.. ముఖ్యంగా చాలామంది ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.. ఈ మధ్యకాలంలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద కోటిన్నర కాజేసిన సైబర్ నేరగాళ్ళు.. అదే తరహాలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసి అతని వద్ద నుంచి 30 లక్షలు కాజేశారు.. సీబీఐ అధికారులం అంటూ అతనిని బెదిరించి ట్రాప్ చేసి డబ్బులు దండుకున్నారు.. వివరాల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 30 లక్షలు కాజేశారు.. ఢిల్లీలో హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ ల్యాండరింగ్ కేసు నమోదు అయిందని.. మేము సిబిఐ అధికారులం అని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సైబర్ ముఠా మాట్లాడింది.. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని.. లేదంటే తనపై చర్యలు తీసుకుంటామని.. అరెస్ట్ చేస్తామని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వీరారెడ్డిని ఆ ముఠా బెదిరించారు. దీంతో అతను ఆ ముఠాకు 30 లక్షల రూపాయలు పంపించాడు.

అయితే, అంతటితో ఆగని ఆ సైబర్ క్రైమ్ ముఠా మళ్ళీ వేధింపులకు గురి చేయడంతో రిటైర్డ్ ఎంఈఓ గా ఉన్న వీరారెడ్డి వేంపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టు చేశారు.. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, బాధితులు వీరారెడ్డి ఇద్దరు మీడియా ముఖంగా జరిగిన విషయాన్ని తెలిపారు..

డబ్బులు పంచుకునే విషయంలో సైబర్ నేరగాళ్ళ మధ్య వచ్చిన గొడవ వలన ఈ నేరం బయటపడినట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనాఈ మధ్య ప్రతి ఒక్కరికి వాట్సప్ కాల్ లో పోలీసుల ఫొటోలతో వస్తున్న కాల్స్ పై దృష్టి పెట్టాలని.. అలా ఎవరన్నా కాల్స్ చేస్తే దానిపై వెంటనే పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు. నేరాలు నమోదు అయితే పోలీసులు స్వయంగా వచ్చి వాటి వివరాలు తెలుపుతారని.. అంతేతప్ప ఇలా వాట్సాప్ ద్వారా వచ్చిన కాల్స్ గానీ.. మొబైల్స్ ద్వారా వచ్చిన కాల్స్ గాని ప్రజలు నమ్మవద్దని సూచించారు. దాని ద్వారా డబ్బుతో పాటు మానసిక ఒత్తిడికి కూడా గురికావాల్సి వస్తుందని.. ఈ విధమైన కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.

సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి 12 లక్షల పైచిలుకు నగదు, 17 సెల్ఫోన్లు, 13 బ్యాంక్ పాస్ బుక్కులు, 52 ఏటీఎం కార్డులు, 16 సిమ్ కార్డులు, 6 ఆధార్ కార్డులు, 6 చెక్ బుక్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .. ఈ ముఠా సభ్యులంతా ముంబై, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు తెలిపారు.

Also Read

Related posts