SGSTV NEWS online
CrimeTelangana

Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో నిన్నటివరకు సాదాసీదా మధ్యతరగతి కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది కేవలం భయం, కన్నీరు, నిస్సహాయత మాత్రమే. కారణం “ఆన్‌లైన్ బెట్టింగ్”. మొబైల్‌లో మొదలైన గేమ్ చివరికి ప్రాణాల మీద పందెంగా మారింది. ఈ కథలో బాధితుడు ప్రణయ్ ఒక సాధారణ యువకుడు. స్నేహితుల పరిచయంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో అడుగుపెట్టాడు. మొదట కొద్ది రూపాయలతో మొదలైన ఆట తర్వాత లక్షల రూపాయల వ్యసనంగా మారింది. “లాభం ఎక్కువ, సులభమైన సంపాదన” అంటూ ముఠా సభ్యులు ప్రలోభపెట్టారు. కొద్దికాలంలోనే ప్రణయ్ వారి వలలో చిక్కుకున్నాడు. మొదట గెలిపించారు. ఆ తర్వాత అప్పుల్లో ముంచేశారు. “మరిన్ని డబ్బులు వేయండి, తిరిగి రాబడతాం” అని నమ్మించారు. కానీ చివరికి నష్టాలే మిగిలాయి. ఆన్‌లైన్‌లో అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. అప్పులు తీర్చకపోతే ప్రాణహాని అని ముఠా బెదిరింపులు మొదలయ్యాయి. తల్లిదండ్రులకు “నీ కొడుకు ప్రాణం పోతుంది.. డబ్బు ఇవ్వకపోతే వీడియోలు విడుదల చేస్తాం” అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వీడియో కాల్స్ ద్వారా హింసించసాగారు.

తల్లి గుండెల్లో నిప్పులే. ప్రాణం కంటే ప్రియమైన కొడుకును కాపాడేందుకు తల్లి తన బంగారం అమ్మింది. అప్పులు చేసి 40 లక్షల వరకు ఇచ్చింది. కానీ డబ్బులు ఇచ్చినా ముఠా దౌర్జన్యం తగ్గలేదు. ఇంకా డబ్బులు కావాలని మరిన్ని బెదిరింపులు వచ్చాయి. ఒక దశలో ప్రణయ్ ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. కుటుంబం అంతా మానసికంగా కృంగిపోయింది. “ఇక మేము బ్రతకలేం” అనే స్థాయికి వెళ్లినా, చివరికి “పోలీసులే మమ్మల్ని కాపాడతారు” అన్న నమ్మకమే వారిని నిలబెట్టింది. కానీ ముఠా నుంచి వస్తున్న హెచ్చరికలు భయపెడుతున్నాయి “ఫిర్యాదు చేస్తే నీ కొడుకు దొరకడు” అని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో కుటుంబం భయాందోళనలో ఉంది. ఈ ఘటన ఒక్కటి కాదు ఇది జిల్లాలో వ్యాపించిన డిజిటల్ ముఠాల భయానక వాస్తవం. సిరిసిల్ల అర్బన్‌తో పాటు అనేక మండలాల్లో కూడా ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ గుంపులు యాక్టివ్‌గా ఉన్నాయన్న సమాచారం బయటకు వస్తోంది. ఈ ముఠాలు విద్యార్థుల నుంచి యువత వరకు అందరినీ వలలోకి దింపుతున్నాయి.

సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నా.. డిజిటల్ దొంగల వల మరింత లోతుగా పాతుకుపోయింది. ప్రతి మొబైల్ ఫోన్‌లో దాగి ఉన్న ఈ ప్రమాదం ఇప్పుడు కుటుంబాలను కూల్చేస్తోంది. ప్రణయ్ కుటుంబం లాంటి అనేక మంది బాధితులు “న్యాయం కావాలి, రక్షణ కావాలి” అంటూ పోలీసుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమాజం మొత్తానికి ఇది హెచ్చరికే “ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ కాదు… అది ప్రాణాలపై పందెం!” డబ్బు కోసం మొదలైన ఆడటం… చివరికి జీవితం మీదే ఆడేస్తుంది

Also Read

Related posts