SGSTV NEWS
CrimeNational

Dasara 2025: జైల్లో దసరా సంబరాలు.. ఇదే అదనుగా ఇద్దరు ఖైదీలు జంప్..


ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సెల్ ఊచలు రంపంతో కోసి వారు తప్పించుకున్నారు.

Dasara 2025: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. దేవి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వందలాది మంది తమ సొంత గ్రామాలకు చేరుకుని తమ బంధువులతో పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గ్రామాలకు చేరుకున్న వారు తిరిగి తమ ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఒడిశాలోని కటక్ జిల్లాలోనూ దసరా వేడుకలు(Dussehra Navratri Celebrations) ఘనంగా నిర్వహించారు, అయితే ఈ వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన  చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. జైల్లో నుంచి ఖైదీలు తప్పించుకోవడం మాములే  అయినప్పటికీ… ఈ ఖైదీలు తప్పించుకున్న తీరు చూసి పోలీసులే విస్తు పోతున్నారు. అచ్చం సినిమా తరహాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఇలా ఉన్నాయి


అక్టోబర్ 3 శుక్రవారం ఉదయం ఒడిశాలోని కటక్ జిల్లాలో ఉన్న హై సెక్యూరిటీ చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారని జైలు అధికారులు స్పష్టం చేశారు. వారిద్దరూ హత్య, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని వారు తెలిపారు. జైలు అధికారులు, ఇతర ఖైదీలు దసరా వేడుకల్లో  లీనమై ఉండగా ఖైదీలు వారి కళ్లుగప్పి తప్పించుకున్నారు. అందరూ వేడుకల హాడవుడిలో ఉండగా ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఖైదీలు… సెల్ ఊచలు రంపంతో కోసి.. దుప్పట్లను ఒకదానికి ఒకటి ముడివేసి తాడు లాగా వాడుకొని జైలు గోడ దూకి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.పారిపోయిన ఇద్దరు ఖైదీలలో బీహార్ కి చెందిన రాజా సాహ్ని, చంద్రకాంత్ కుమార్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   బీహార్ లోని జాజ్‌పూర్ జిల్లాలో నగల దుకాణంలో చోరీ చేయడంతో పాటు ఇద్దరిని హత్య చేసిన కేసులో ఈ ఇద్దరు ఖైదీలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వారిని హై సెక్యూరిటీ జైలుకు తీసుకురాగ వారిని జైలులోని రెండు ప్రత్యేక హై సెక్యూరిటీ సెల్స్ లో ఉంచామని అయినా వారు తప్పించుకోవడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులు తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున 1: 30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పారిపోయిన ఖైదీలను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని..ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు సీనియర్ జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో ఖైదీలు తమ సెల్స్ లోపలికి రంపాలను ఎలా తీసుకెళ్లగలిగారు, ఊచలను ఎలా కత్తిరించగలిగారు, వారు కత్తిరిస్తున్న సమయంలో వార్డు సిబ్బంది ఎందుకు గమనించలేదు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు  తెలిపారు.


మరోవైపు పారిపోయిన ఖైదీలను పట్టించినవారికి రూ. 50 వేలు రివార్డ్ కూడా ప్రకటించారు పోలీసులు. ఈ ఘటనతో  హై సెక్యూరిటీ కలిగిన చౌద్వార్ జైలులో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జైలులో హైలెవెల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు చాలామంది  శిక్ష అనుభవిస్తున్నారు.ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Also read

Related posts