ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది.
ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను..
నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్టే స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025