February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Bribery Case: పైకం లేకపోతే ఫైల్ కదలదు.. అడ్డంగా బుక్కైన లంచగొండి ఆఫీసర్లు!


తెలంగాణలో మరో ముగ్గురు లంచగొండి ఆఫీసర్ల బాగోతం బయటపడింది. జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భూమి సర్వే, వెంచర్‌ పర్మిషన్, ట్రాన్స్‌ఫార్మర్‌ పనులకోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Bribery Case: తెలంగాణలో మరో ముగ్గురు లంచగొండి ఆఫీసర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. భూమి సర్వే, వెంచర్‌ పర్మిషన్, ట్రాన్స్‌ఫార్మర్‌ తదితర పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో అవినీతిపరులను అదుపులోకి తీసుకోగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

రంగారెడ్డిలో..
ఈ మేరకు ఏసీబీ(Telangana ACB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) గోపన్‌పల్లిలో అపార్టుమెంట్లకు రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు సీటీ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శివకుమార్‌రెడ్డి అనే గుత్తేదారు ఒప్పందం చేసుకున్నాడు. అయితే గచ్చిబౌలి అసిస్టెంట్‌ డివిజినల్‌ ఇంజినీర్‌(ADE)గా పనిచేస్తున్న కొట్టె సతీష్‌(43) ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50వేల చొప్పున ఇవ్వాలని అడిగాడు. అయితే గతంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ కు రూ.25 వేలు ఇచ్చామని చెప్పిన వినకుండా డిమాండ్ చేశాడు. దీంతో సదరు గుత్తేదారు ఏసీబీకీ ఫిర్యాదు చేయగా గచ్చిబౌలిలోని ఏడీఈ కార్యాలయంలో రూ.50వేలు ఇస్తుండగా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు

జోగులాంబ గద్వాలలో..
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జాతీయ రహదారి 44 దగ్గరలో అన్నపూర్ణ గ్రీన్‌ఫీల్డ్‌ వెంచర్‌ వేశారు. అయితే దీనికి పుల్లూరు పంచాయతీ అనుమతులు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై వెంచర్‌ మేనేజర్‌ మహ్మద్‌ ఎజాజ్‌ గ్రామ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. ఈ క్రమంలో తనకు రూ.2 లక్షలు ఇస్తే అన్నీ చూసుకుంటానన్నారు ప్రవీణ్‌. దీంతో ఎజాజ్‌ ఏసీబీని ఆశ్రయించాడు. గ్రామంలోని ఓ ఆలయం వద్ద రూ.2 లక్షలు ప్రవీణ్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే డీపీవో శ్యాంసుందర్‌ ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు ప్రవీణ్‌ తెలిపాడు. ఈ కేసులో ఏ1గా శ్యాంసుందర్, ఏ2గా ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు

నల్గొండ మర్రిగూడంలో..
నల్గొండ జిల్లా సరంపేటకు చెందిన ఒక రైతు వ్యవసాయ భూమి సర్వే కోసం అప్లై చేసుకున్నాడు. అయితే కమ్యూనిటీ సర్వేయర్‌ రవి నాయక్‌ రూ.15 వేలు లంచం ఇస్తేనే సర్వే చేస్తానని చెప్పాడు. దీంతో చేసేదేమీలేక సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.12వేలు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌కు ఇస్తుండగా అధికారులు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నల్గొండ డీఎస్పీ జగదీశ్‌ చందర్‌ చెప్పారు


Also read

Related posts

Share via