February 3, 2025
SGSTV NEWS
Crime

శ్రీవారి యాత్రికులపై దూసుకెళ్లిన అంబులెన్స్‌..  ఇద్దరు మృతి

ఐదుగురికి తీవ్ర గాయాలు

చంద్రగిరి : ప్రమాదానికి గురైన వ్యక్తుల ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్‌ పొగమంచు కారణంగా సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా వెళుతున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు… గుండెపోటుకు గురైన రోగిని ఎక్కించుకొని మదనపల్లి నుండి 108 వాహనం తిరుపతి రుయా ఆస్పత్రికి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున చంద్రగిరి మండలం, ఏ రంగంపేట సమీపంలో నర్సింగాపురం జాతీయ రహదారి వద్ద తిరుమలకు శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న వారిపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45) అక్కడికక్కడే మతి చెందారు. మరో ఐదుగురు కె రెడ్డెమ్మ, వి రెడ్డెమ్మ, యశోద, తులసమ్మ, రమేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారని వారి బంధువులు బోరుమని విలపించారు. యాత్రికులను ఢకొీన్న 108 అంబులెన్స్‌లోని గుండెపోటు రోగిని మరో 108 వాహనం రప్పించి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరుపతి మెడికల్‌ కళాశాలకు పోలీసులు తరలించారు. తీవ్ర గాయపడిన తులసమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. నలుగురు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రగిరి సిఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రుయా వైద్యులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఫోన్‌ ద్వారా కోరారు.

Also Read

Related posts

Share via