October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

భర్త, పిల్లల మృతిని తట్టుకోలేక మహిళ బలవన్మరణం

ఏలూరు జిల్లా కవ్వకుంటలో విషాదం

పెదవేగి,: ఆమెకు తన కుటుంబమే లోకం.. కంటికి రెప్పలా చూసుకునే భర్త.. కలువల్లాంటి బిడ్డలతో అన్యోన్యంగా జీవించేవారు. చేతికి అందివస్తున్న పిల్లలను చూసి మురిసిపోయేవారు. ఆ చిన్ని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. నిర్దాక్షిణ్యంగా కాల రాసేసింది. కాలువలో దిగి భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి కాగా, తల్లడిల్లిపోయిన ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), దేవి (36) కుటుంబం పందెం కోళ్లను పెంచి అమ్ముతుంటుంది. వారి కుమారులు మణికంఠ (15), సాయికుమార్ (13) పందెం కోడితో ఈత కొట్టించడానికని బుధవారం పోలవరం కుడి కాలువకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా నీటిలో దిగి, ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఇద్దరు కుమారులను రక్షించడం కోసం కాలువలో దిగిన వెంకటేశ్వరరావు కూడా జలసమాధి అయిపోయారు. ఒకేసారి భర్త, పిల్లలు దూరం కావడంతో దేవి (36) వారిని తలచుకుంటూ రెండ్రోజులుగా తీవ్ర మానసిక వేదన చెందుతోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో  ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే కుటుంబమంతా తనువు చాలించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.





Also read

Related posts

Share via