October 17, 2024
SGSTV NEWS
CrimeLifestyleTelangana

Telangana: అభినవ కర్ణుడీ బిడ్డడు.. బట్టల బ్యాగులో పిల్లాడిని ఉంచి నదిలో పడేసిన తల్లి! కుంతీ బాటలోనే మరోసారి..

ఆనాడు పెళ్లికి ముందే సూర్య భగవానుడి వరం వల్ల తల్లైన కుంతి.. లోకానికి భయపడి అప్పుడే పుట్టిన కర్ణుడిని ఓ తొట్టిలో పెట్టి నీళ్లలో వదిలి వెళ్లిపోతుంది. సంతానం లేని సూతవంశజుడు, ఆయన భార్య రాధకు ఆ పెట్టె దొరికడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. భారతంలో కర్ణుడు తల్లిదండ్రులకు దూరమై పడిన వేదన అంతాఇంతా కాదు. అయితే నేటికి కుంతి లాంటి మహిళలు మన సమాజంలో ఇంకా ఉన్నారనడానికి..

హుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 13: ఆనాడు పెళ్లికి ముందే సూర్య భగవానుడి వరం వల్ల తల్లైన కుంతి.. లోకానికి భయపడి అప్పుడే పుట్టిన కర్ణుడిని ఓ తొట్టిలో పెట్టి నీళ్లలో వదిలి వెళ్లిపోతుంది. సంతానం లేని సూతవంశజుడు, ఆయన భార్య రాధకు ఆ పెట్టె దొరికడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. భారతంలో కర్ణుడు తల్లిదండ్రులకు దూరమై పడిన వేదన అంతాఇంతా కాదు. అయితే నేటికి కుంతి లాంటి మహిళలు మన సమాజంలో ఇంకా ఉన్నారనడానికి నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే కుంతి మాదిరి గానే ఓ తల్లి పొత్తిళ్లలోని పసికందును బ్యాగులో పెట్టి నీళ్లలో వదిలింది. నీళ్లలో తేలుతూ వచ్చిన బ్యాగులో పసిబిడ్డ ఏడుపు విని ఓ మహానుభావుడు రక్షించిన ఘటన హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ దిగువ కాలువలో అందులో మోకాలు లోతు నీళ్లున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుమ్మనపల్లికి చెందిన గుండేటి చొక్కారెడ్డి అనే రైతు తన ట్రాక్టర్‌ను కడిగేందుకు ఈ నీళ్లలోకి దిగాడు. అయితే చొక్కారెడ్డిక ఎక్కడి నుంచో పసికందు ఏడుపు వినిపించింది. చుట్టుపక్కల చూసినా.. పసిపిల్లల ఆనవాళ్లు కనిపించ లేదు. గుక్కపెట్టిన ఏడుస్తున్న బిడ్డ ఏడుపు విని మళ్లీ చుట్టూ గమనించసాగాడు. అక్కడ కాలువ లైనింగ్‌ మధ్యలో చిన్న చెట్టు కొమ్మకు తట్టుకొని ఉన్న ఓ బట్టల బ్యాగ్‌పై అతడి దృష్టి నిలిచింది. దగ్గరకు వెళ్లి చూడగా.. ఆ సంచి నుంచే ఏడుపు వినిపిస్తున్నదని గుర్తించాడు. బ్యాగ్‌ ఓపెన్‌ చేసి చూడగా.. తల కూడా కనిపించకుండా పూర్తిగా గుడ్డలతో చుట్టి ఉన్న ఆకారం కనిపించింది.

దానిని విప్పి చూసేసరికి నవజాత మగ శిశువు కనిపించింది. వెంటనే చొక్కారెడ్డి బిడ్డను తీసుకుని స్థానిక మాజీ సర్పంచ్‌ గూడూరి ప్రతాప్‌రెడ్డికి, మాజీ ఎంపీటీసీ యాళ్ల రాజేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. వీరు హుజూరాబాద్‌ టౌన్‌ సీఐ తిరుమల్‌ గౌడ్‌కు విషయం తెలపడంతో వారు వచ్చి, శిశువును హుజూరాబాద్‌ ఏరియా దవాఖానకు తరలించారు. శిశువు పుట్టి 24 గంటలు కూడా కాలేదని వైద్యులు తెలిపారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని, కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఎవరికి భారమయ్యాడో తెలియదు గానీ, పుట్టీపుట్టగానే బిడ్డను నీటిపాలు చేసినా.. మృత్యుంజయుడైనాడు ఆ పసికందు. సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆ పసిమొగ్గను చూసిన వారికి గుండె తరుక్కుపోతుంది. మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు.

Also read

Related posts

Share via