శ్రీకాకుళం: బాదం పాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో చోటుచేసుకుంది. వారంతా విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్థానిక పీహెచ్సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మామిడివలస ప్రాంతానికి చెందినవారే 25 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 1, 2వ తేదీల్లో సింగుపురంలో నిర్వహించిన కొండమ్మ తల్లి ఉత్సవాల్లో వేల మంది పాల్గొన్నారు. పాత పంచాయతీ కార్యాలయం వేప చెట్టు కింద ఓ వ్యక్తి వ్యాన్లో బాదం పాలు తీసుకొచ్చి విక్రయించాడు.
ఎండ తీవ్రంగా ఉండటంతో ఉపశమనం పొందడానికి చాలా మంది కొనుగోలు చేసి తాగారు. గురువారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రుల బాట పట్టారు. ఈ విషయమై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ‘ఈనాడు’ సంప్రదించగా బాధితులకు ప్రాణాపాయం లేదని.. వైద్యులను అందుబాటులో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తున్నామని చెప్పారు. బాధితులకు అందుతున్న చికిత్స, ప్రస్తుత పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Also read
- 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?
- వాస్తు శాస్త్రం: ఉప్పు నీటితో స్నానం చేస్తే ఈ 5 ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి!
- నేటి జాతకములు 5 ఏప్రిల్, 2026
- అమానుషం.. హోటల్ ముందు వచ్చి అడుకుంటున్నాడని.. ఏం చేశారో చదవండి
- బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత…శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో ఘటన.





