July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

యాదాద్రి : కన్న కొడుకే అలా చేయడంతో.. తట్టుకోలేక ఆ తల్లి దారుణం

కన్న బిడ్డ కోసం ప్రతి నిత్యం ఆలోచించే ఆ తల్లి.. కొడుకు చేసిన దారుణాన్ని భరించలేక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

నవ మాసాలు కడుపులో మోసి.. రక్తమాంసాలు పంచి.. ప్రాణం పోతుందని తెలిసినా పురిటి నొప్పులు భరించి.. బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ పసిగుడ్డు ముఖం చూడగానే అప్పటి వరకు తాను అనుభవించిన ప్రసవవేదనను మరచిపోయి.. బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి.. బిడ్డ ఆకలి తీరుస్తుంది. కడుపు చించుకుని.. తన ఒడికి చేరిన కన్న బిడ్డ కోసం.. జీవితాంతం శ్రమిస్తుంది తల్లి. బిడ్డలకు మంచి, చెడు తెలియజేస్తూ.. వారిని మంచి మార్గంలో ముందుకు నడుపుతూ.. ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కంటుంది. మరి తల్లి కడుపుకు చీల్చిన ఆ బిడ్డలు.. అమ్మ మాట వింటారా అంటే కొన్ని సందర్భాల్లో వింటారు.. కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు. అయితే అప్పుడప్పుడు కొన్ని దారుణాలు మన కళ్లకు కనబడుతుంటాయి. ఆస్తి కోసం, అన్నం పెట్టాల్సి వస్తుందని.. కన్న తల్లినే అత్యంత దారుణంగా హింసించే సంతానాన్ని చూశాం. ఇక తాజాగా ఓ దారుణం చోటు చేసుకుంది.

చెడు వ్యసనాల బారిన పడ్డ.. కన్న బిడ్డ బాగు కోసం అతడికి నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించింది ఓ తల్లి. కానీ ఆ కొడుకు అమ్మ మాట వినలేదు సరికదా.. తిరిగి ఆమె మీదనే చేయి చేసుకున్నాడు. కొడుకు చేసిన అవమానాన్ని తట్టుకోలేపోయిన ఆ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

కొడుకు చేయి చేసుకోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోత్కూరుకు చెందిన రేఖ అనే మహిళకు ఇంటర్‌ చదివే కుమారుడు ఉన్నాడు. అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివేందుకు జాయిన్‌ అయ్యాడు. అయితే అక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాడు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి.. కళ్ల ముందే కన్నబిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయింది. దాంతో కొడుకును మంచి దారిలో పెట్టడానికి అతడికి నాలుగు మంచి మాటలు చెప్పింది.


ఇంటర్‌ వయసులోనే ఇలాంటి చెడు అలవాట్ల బారిన పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని.. ఇప్పటికైనా ఆ అలవాట్లు మానుకోమని.. బాగా చదువుకోమని కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసింది రేఖ. అయితే తల్లి మాటలు ఏమాత్రం రుచించని కొడుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగక.. కన్న తల్లిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ తల్లి మనసు విలవిల్లాడింది. కన్న కొడుకు చేసిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దాంతో దారుణ నిర్ణయం తీసుకుంది. తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడ్డ ఆ తల్లి.. చివరకు కన్న కొడుకు చేత తన్నులు తింటానని అస్సుల ఊహించేలేదు. తల్లి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Also read

Related posts

Share via