SGSTV NEWS online
Andhra PradeshCrime

Vivekananda Case: వివేకా హత్య కేసు కీలక మలుపు.. సునీత పిటిషన్పై వచ్చేవారం సుప్రీంలో విచారణ


Vivekananda Case: టీవీల్లో సీరియల్ మాదిరిగా మాజీమంత్రి వివేకానంద హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందా? ఓ అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి వెళ్తందా? సీబీఐ కోర్టు ఆదేశాలపై మళ్లీ సుప్రీంకోర్టుని సునీత ఆశ్రయించారా? అందులో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? న్యాయస్థానం ఏం చెప్పింది?

వివేకానంద కేసులో కీలక పరిణామం

వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కోసం పాక్షికంగా ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సునీత సవాల్ చేశారు. ప్రస్తుత అప్లికేషన్, పెండింగ్ పిటిషన్లపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని గతంలో హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపింది ట్రయల్ కోర్టు. కేవలం ఇద్దరి పాత్రపై విచారణ జరపాలని పాక్షిక ఆదేశాలిచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు.

వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ

తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు సునీత. ధర్మాసనం మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఆదేశాలు ఇచ్చినట్టు అందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదా వేయనుంది.

అసలేం జరిగింది? గతేడాది డిసెంబరు 16న వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సంబంధించి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో రెండో నిందితుడు సునీల్యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్, ఏడో నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డి సోదరుడు ప్రకాశ్ రెడ్డి మనవడు అర్జున్రెడ్డి మధ్య సందేశాలు, వారి పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

దర్యాప్తు పూర్తి చేసి నెలరోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అసలు దర్యాప్తు చేయాలా? వద్దా? అనేది కోర్టు నిర్దేశించాలన్నారు. కానీ ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో దర్యాప్తు సంస్థకు నిర్దేశించకూడదని అప్పటి సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తులో చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.

చాలా అంశాలపై దర్యాప్తు జరగాలని సునీత విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక్క అంశానికి దర్యాప్తు పరిమితం చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో సునీత తన న్యాయవాదులతో చర్చించిన తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేసి, బాధితులు కోరినట్టు విచారణ చేపట్టాలని చెబితే జగన్ ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవనే చర్చ మొదలైంది.

Also read

Related posts