ఏలూరు జిల్లా కవ్వకుంటలో విషాదం
పెదవేగి,: ఆమెకు తన కుటుంబమే లోకం.. కంటికి రెప్పలా చూసుకునే భర్త.. కలువల్లాంటి బిడ్డలతో అన్యోన్యంగా జీవించేవారు. చేతికి అందివస్తున్న పిల్లలను చూసి మురిసిపోయేవారు. ఆ చిన్ని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. నిర్దాక్షిణ్యంగా కాల రాసేసింది. కాలువలో దిగి భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి కాగా, తల్లడిల్లిపోయిన ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), దేవి (36) కుటుంబం పందెం కోళ్లను పెంచి అమ్ముతుంటుంది. వారి కుమారులు మణికంఠ (15), సాయికుమార్ (13) పందెం కోడితో ఈత కొట్టించడానికని బుధవారం పోలవరం కుడి కాలువకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా నీటిలో దిగి, ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఇద్దరు కుమారులను రక్షించడం కోసం కాలువలో దిగిన వెంకటేశ్వరరావు కూడా జలసమాధి అయిపోయారు. ఒకేసారి భర్త, పిల్లలు దూరం కావడంతో దేవి (36) వారిని తలచుకుంటూ రెండ్రోజులుగా తీవ్ర మానసిక వేదన చెందుతోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే కుటుంబమంతా తనువు చాలించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025