పండుగ పూట ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. పుట్టింటికి వచ్చి సరదాగా గడుపుదామనుకున్న ఆ తల్లిని, కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు ఊహించని రూపంలో కబళించింది. రొయ్యల చెరువులో ఏరియేటర్ తిరిగే ఐరన్ రాడ్కు చీర కొంగు చిక్కుకోవడంతో.. తల్లి, ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఏలూరు జిల్లా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాసరావుకు కలిదిండికి చెందిన వీరనాగ జ్యోతికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగజ్యోతి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆమె పెద్దకూతురు గుడికి వెళ్ళగా నాగజ్యోతి తన చిన్నకూతురు హేమతో కలిసి తండ్రి సాగు చేస్తున్న రొయ్యల చెరువుకు వెళ్లింది.ఈ క్రమంలో అక్కడే గట్టుపై ఉన్న ఇంజన్కు ఉన్న ఫ్యాన్ సెట్ రాడ్ దాటుతుండగా నాగ జ్యోతి బట్టలు దానికి చుట్టుకుపోయాయి. దీంతో ఆమెతో పాటు తన కూతురు హేమ సైతం అందులో చిక్కుకుపోయి రోల్ అవ్వటంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు వదిలారు.
సాధారణంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు చున్నీలు, పైట కొంగులు చక్రాల్లో పడటం చూస్తుంటాం. కానీ రొయ్యల చెరువుల వద్ద ఏరియేటర్స్ విషయంలోనూ ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని ఎవరూ ఊహించలేదు. గట్టుపై రాడ్లు తిరుగుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉండటం, వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం ప్రాణాంతకంగా మారింది. చెరువుల వద్ద ఏరియేటర్ రాడ్లకు రక్షణ కవచాలు లేకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. శివరాత్రి వేళ పుట్టింటికి వచ్చిన కూతురు, మనవరాలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కలిదిండి మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





