SGSTV NEWS online
Andhra PradeshCrime

నరసాపురం కాలవలో విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్థిని గల్లంతు!



Student Missing: తూర్పుగోదావరి జిల్లా
ఉండ్రాజవరం మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కాలువలోని ఈతకు దిగి నీటి ప్రవాహంలో ఓ విద్యార్థిని గల్లంతైది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గుణ్ణం ప్రసన్న (26) అనే యువతి తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది. తన కాలేజీ సర్టిఫికేట్ కోసం గూడెం వెళ్లగా.. గుడ్ ఫ్రైడే సెలవు కారణంగా శనివారం రావాలని సిబ్బంది సూచించారు. దీంతో ప్రసన్న తన స్నేహితులు పవన్ తేజ, రావులపల్లి సమీర్లతో కలిసి ఉండ్రాజవరం మండలంలోని కొండాలమ్మ గుడి సందర్శనకు వెళ్లారు.

గుడి ఎదురుగా ఉన్న నర్సాపురం కాలువలో తొలుత సమీర్ ఈతకు దిగాడు. ఆ తర్వాత ప్రసన్న కూడా కాలువలోకి దిగగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతం కావడంతో ప్రసన్న కొట్టుకుపోయింది. సమీర్ ఆమెను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గట్టుపై ఉన్న శ్రీకర్ అనే యువకుడు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మరికొందరు యువకులు స్పందించి సమీరు సురక్షితంగా బయటకు తీశారు. అయితే ప్రసన్న మాత్రం ప్రవాహంలో గల్లంతైంది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కాకినాడ నుండి వచ్చిన 15 మంది సభ్యులతో కూడిన ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందం బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు, తహశీల్దార్ ప్రసార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి గాలింపును పర్యవేక్షిస్తున్నారు. ప్రసన్న గల్లంతవ్వడంతో తల్లిదండ్రులు కాలువ గట్టు వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతం ప్రసన్న ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.

Also Read

Related posts