October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Nandigama: పోలీసుల దొంగాట.. పట్టుకున్న సొమ్మునే కొట్టేసిన వైనం

దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులే కొట్టేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

నందిగామ, : దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులే కొట్టేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూరు ఓ లారీలో మిర్చి లోడ్ చేసి, మైలవరానికి చెందిన డ్రైవర్ షేక్ ఖయీంకి ఇచ్చి పంపారు. క్లీనర్గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు వెళ్లాడు. సరకు విక్రయించగా వచ్చిన రూ. 25 లక్షలు తీసుకుని వారు తిరిగి బయలు దేరారు. ఈ నెల 21న పాల్వంచ జంక్షన్ వద్ద కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. నందిగామ మండలం జొన్నలగడ్డ వద్దకు వచ్చాక ఖయీంకు అనుమానం వచ్చి చూసుకోగా  లారిలో ఉంచిన డబ్బు కనిపించలేదు. దీనిపై గురువారం నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద కోటేశ్వరరావును పట్టుకున్నారు. అతడి వద్ద రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకొని, అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. ఆనక రూ.18.52 లక్షలు మాత్రమే దొరికినట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో ఏసీపీ రవికిరణ్ నందిగామలో మాట్లాడుతూ.. చోరీ సొత్తు రూ. 18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కానీ, లారీ డ్రైవర్, రైతులు మాత్రం రూ. 25 లక్షలు చోరీకి గురైనట్లు వాపోయారు. దీంతో క్లీనర్ను విచారించగా, పోలీసులే రూ. ఆరు లక్షలు తీసుకున్నట్లు చెప్పాడు. వారిని విచారించగా, రూ.3.95 లక్షలు అప్పగించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం గురించి తెలియాల్సి ఉంది. ఈ కేసులో జొన్నలగడ్డ చెక్పోస్టు ఏఆర్ ఏఎస్సై భావురశెట్టి రుద్రరాజు, హెడ్ కానిస్టేబుల్ కొలుసు నాగబాబు, కానిస్టేబుల్ ముతకన అరుణ్కుమార్తోపాటు సివిల్ కానిస్టేబుళ్లు ముచ్చు శివరామకృష్ణప్రసాద్, జంగాల సృజన కుమార్లను సస్పెండ్ చేశారు. వీరిని కూడా నిందితులుగా చేర్చారు. 

Also read

Related posts

Share via