SGSTV NEWS
Andhra PradeshCrime

ఆర్థిక విభేదాల వల్లే వృద్ధుడి హత్య..?

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురానికి చెందిన పసుపులేటి సుబ్బరాయుడి హత్యకు ఆర్థిక విభేదాలే కారణమని తెలుస్తోంది.



కర్నూలు, మహానంది, : నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురానికి చెందిన పసుపులేటి సుబ్బరాయుడి హత్యకు ఆర్థిక విభేదాలే కారణమని తెలుస్తోంది. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, పసుపులేటి సుబ్బరాయుడు ఇద్దరూ వైకాపాలో ఉన్నప్పుడే ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు పడేవారు. సుబ్బరాయుడుకు చెందిన 15 సెంట్ల స్థలాన్ని శ్రీనివాసరెడ్డి తీసుకోవడం, మరోచోట స్థలం ఇస్తానని చెప్పిన మాట మూడేళ్లుగా అమలు చేయకపోవడంతో గొడవలు జరిగేవి. మూడు సెంట్ల స్థలాన్ని రూ.2లక్షలకు కొనుగోలు చేయించిన శ్రీనివాసరెడ్డి ఆ స్థలం కూడా ఎక్కడుందో చూపించకుండా సుబ్బరాయుడికి ఇబ్బంది పెట్టేవాడని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి వైకాపా నుంచి తెదేపాలోకి మారినా సుబ్బరాయుడు వైకాపాలోనే ఉండిపోయారు. మరోవైపు తన ఎకరా పొలాన్ని శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడని, ప్రత్యామ్నాయంగా ఇస్తానన్న పొలం ఇవ్వాలని నిలదీస్తే అత్యాచారం కేసు పెట్టించి జైలుకు పంపించాడని గ్రామానికి చెందిన పల్లంరాజు వాపోతున్నారు.

శనివారం అర్ధరాత్రి సుబ్బరాయుడు, పల్లంరాజుల ఇళ్లపై  దాడులు జరగడానికి వారితో శ్రీనివాసరెడ్డికి ఉన్న విభేదాలే  కారణమని తెలుస్తోంది. సుబ్బరాయుడి హత్యోదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్  కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లతో సీతారామాపురానికి వెళ్లడం,  పరిస్థితి తీవ్రతను పోలీసు ఉన్నతాధికారులకు వివరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నంద్యాల   శివారు నుంచి ఐదు కి.మీ. దూరంలోనే ఉన్న సీతారామాపురానికి అదనపు బలగాల్ని పంపాలని కోరితే  కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం  ఉన్నా.. ఉదాసీనంగా వ్యవహరించారని స్థానికులు  మండిపడుతున్నారు. శ్రీనివాసరెడ్డితోపాటు సుమారు 38  మంది గ్రామంలో దాడి చేయడానికి తిరుగుతున్నా, వచ్చిన  వారిలో సుమారు 10 మంది గ్రామస్థులే కాకపోయినా  చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ప్రచారం  జరుగుతోంది.

Also read

Related posts