June 29, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

భార్య ఆ పని చేస్తుందంటూ భర్త ఆగ్రహం.. చివరకు దారుణం



భార్యాభర్తలిద్డరూ ఒకరికి ఒకరు తోడు నీడలా, చేదోడు వాదోడుగా ఉంటే ఆ కాపురం హాయిగా సాగిపోతుంది. కానీ అనుమానం అపార్థాలకు తావునిస్తే సంసారం నిప్పుల కుంపటి మారిపోతుంది.

భార్యా భర్తలు పాలు, నీళ్లల్లా కలిసి ఉంటే ఆ కాపురం సాఫీగా సాగిపోతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ప్రతి పనిని షేర్ చేసుకుంటే అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ఇళ్లు గడుస్తుంది. ఒక్కరి జీతంతో కుటుంబాన్ని పోషించడం ఈ కాలంలో చాలా కష్టం. భార్య సంపాదన ఎక్కువ కాకపోయినా.. భర్త సంపాదనకు వేడీ నీళ్లకు.. చన్నీళ్లుగా కలిసి వస్తుంటుంది ఆమె జీతం. నువ్వు పని చేయకూడదు, నువ్వు బయటకు వెళ్లకూడదు అన్న ఆంక్షలు గీసుకుంటే.. ఫలితం అప్పులు, ఆర్థిక సమస్యలు వెరసి.. సంసారం చిరాకు, పరాకులతో మొదలై పీక్స్ కు చేరుకుంటుంది. చివరకు ఒకరిపై ఒకరు మాట విసురుకుని, ఆ తర్వాత చేయి చేసుకునే వరకు వెళుతుంది. ఆపై యుద్దాలు జరుగుతాయి. ఈ క్రమంలో ఎంతటి పరిణామాలైనా దారి తీయోచ్చు.

ఇదిగో ఇలాంటి దారుణాలు కూడా జరగొచ్చు. భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త.. ఆమెను చంపి..సెల్ఫీ దిగి.. చివరకు అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈటాహ్ ప్రాంతానికి చెందిన దంపతులు ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్నారు. భర్త లోనీలో పనిచేస్తుండగా.. భార్య నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తుంది. అయితే భార్య ఉద్యోగానికి వెళ్లడం ఇష్టం లేని భర్త.. జాబ్ మానేసి ఇంట్లో ఉండాలి అంటూ కోరేవాడు. అంతకు భార్య ఒప్పుకునేది కాదు. దీనిపై భార్యా భర్తలిద్దరికీ గొడవలు జరిగేవి. ఇదే విషయంపై తాజాగా కూడా వీరిద్దరి మధ్య తగాదా జరిగింది. తాను జాబ్ మానేది లేదని చెప్పడంతో.. కోపంతో స్కార్ఫ్‌ను భార్య గొంతుకు బిగించి హత్య చేశాడు.

భార్య చనిపోయిన తర్వాత.. ఏ మాత్రం బాధ లేకుండా ఆమె మృతదేహాన్ని తన ఒడిలో సెల్ఫీ దిగి కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించాడు. ఈ ఫోటోను చూసిన నిందితుడి తమ్ముడు.. అన్నకు కాల్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సోదరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హుటా హుటిన దంపతులు నివసిస్తున్న ఇంటికి వచ్చాడు. తీరా వచ్చి చూడగా.. వదిన నిర్జీవంగా పడి ఉండగా.. అన్న ఉరి కొయ్యకు వేలాడుతున్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తొలుత భర్త తన భార్యను స్కార్ఫ్‌తో గొంతుకు బిగించి చంపి, ఆపై అదే స్కార్ఫ్‌తో ఉరి వేసుకున్నట్లు వెల్లడించాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందు, చనిపోయిన తన భార్యతో సెల్ఫీ తీసుకుని తన బంధువులకు పంపించాడని తెలిపారు.

Also read

Related posts

Share via