SGSTV NEWS
CrimeTelangana

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

రామగిరి(నల్లగొండ): అనుమానంతో భార్యను భర్త హత్య  చేశాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం నూకలవారిగూడేనికి చెందిన గుండెబోయిన నాగరాజుకు 2001లో గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన జ్యోతి(40)తో వివాహం అయ్యింది.

వ్యవసాయం చేస్తున్న నాగరాజు మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఆదివారం మధ్యాహ్నం గేదెలను తోలుకొని జ్యోతి ఊరి చివరకు వెళ్లింది. అనుమానంతో భార్యను వెంబడించిన నాగరాజు గొడవకు దిగి కోపంతో జ్యోతి తలపై విచక్షణారహితంగా మోదాడు. దీంతో స్పృహ తప్పిన జ్యోతిని ఇంటికి తీసుకొచ్చాడు.

స్పృహ తప్పి పడిపోయిందని చుట్టుపక్కల వారికి చెప్పి  అంబులెన్సు లో నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. జ్యోతి తలపై గాయాలను చూసిన ఆమె తండ్రి  భైరవోని స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరికి ఇద్దరు  కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు  చేసుకున్న పోలీసులు సోమవారం పోస్టుమార్టం చేసి జ్యోతి  మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Also read

Related posts

Share this