SGSTV NEWS online
Andhra PradeshCrime

సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

 



ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు, పెరిగిపోయిన అప్పుల భారం తాళలేక ఓ చీఫ్ ఇంజనీర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని బొమ్మసముద్రంకు చెందిన చల్లగుండ్ల హర్షవర్ధన్ , గత 15 ఏళ్లుగా విశాఖలోని ఒక షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. పెదగంట్యాడ వినాయక నగర్‌లో భార్య, ఐదేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం ఉదయం ‘ఊరు వెళ్తున్నాను’ అని భార్యకు చెప్పి బయలుదేరిన ఆయన, దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కిందపడి ప్రాణాలు విడిచారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే హర్షవర్ధన్ తన భార్య మొబైల్‌కు ఒక ఉద్వేగభరిత మెసేజ్ పంపారు. స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల సుమారు 36 లక్షల అప్పులు చేశాను. కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను.. పాపను జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్‌ పెట్టి, తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడు. ఆ మెసేజ్ చూసి కంగారు పడిన భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కానీ, పోలీసులు గాలింపు చేపట్టే లోపే ఆయన మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. హర్షవర్ధన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి బంధువులు, స్నేహితులు ఆదుకుంటామని భరోసా ఇచ్చినప్పటికీ, ఆయన మనస్తాపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా సన్నిహితులతో పంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఐదేళ్ల చిన్నారిని అనాథను చేసింది. కష్టాలు అందరికీ వస్తాయని, కానీ పోరాడి గెలవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని పోలీసులు సూచిస్తున్నారు.

Also read

Related posts