SGSTV NEWS
CrimeTelangana

Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..

 

మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన చోరీ జరిగింది. అర్ధరాత్రి కిరాణా జనరల్ స్టోర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన ముగ్గురు దొంగలు, దాదాపు రూ. 2 లక్షల నగదు, సిగరెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్లారు. దొంగలు తమ ఆనవాళ్లు దొరకకుండా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను కూడా దొంగిలించారు. చోరీ విజువల్స్ ఎలా రికార్డ్ అయ్యాయో తెలుసా..?

ఇది చాలా విచిత్రమైన చోరీ సంఘటన. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటనలో దుండగులు చోరీకి సినీ ఫక్కీలో స్కెచ్ వేశారు. అయితే వారు దొంగిలించిన వాటి వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కిరాణా జనరల్ స్టోర్ యజమాని ధీరజ్ రామ్ రోజు మాదిరిగానే రాత్రి షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అర్ధరాత్రి వేళ ముగ్గురు గుర్తుతెలియని దుండగులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. దొంగలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మొహాలకు మాస్కులు ధరించారు. షాపులోని వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉన్నా, దుండగులు ప్రధానంగా సిగరెట్ బాక్స్‌లు పెట్టే కబోర్డ్‌లోని సరుకుతో పాటు కౌంటర్‌లోని నగదునుదోచుకెళ్లారు. బాధితుడి అంచనా ప్రకారం.. సుమారు రూ.2లక్షల నగదు చోరీ జరిగింది.

డబ్బుతో పాటు హార్డ్ డిస్క్
దొంగలు మరింత తెలివిగా ప్రవర్తించారు. తమ ఆనవాళ్లు ఎక్కడా దొరకకుండా ఉండేందుకు షాపులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్లారు. ఈ షాపులో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉండగా వాటిలో మూడు కెమెరాలకు అనుసంధానం చేసిన హార్డ్ డిస్క్‌ను దొంగలు దోచుకెళ్లారు.



సీక్రెట్ కెమెరాలో రికార్డు
అయితే, దుండగులకు తెలియని విషయం ఏమిటంటే.. హార్డ్ డిస్క్ అనుసంధానం లేని రహస్యంగా ఉంచిన నాలుగవ సీసీ కెమెరాలో వారి చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చోరీ జరిగిందని గుర్తించిన షాపు యజమాని ధీరజ్ రామ్ హార్డ్ డిస్క్‌తో సంబంధం లేని ఆ మరో సీసీ కెమెరాను పరిశీలించగా, ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి లోపలికి వచ్చి సిగరెట్ బాక్స్‌లు, నగదు చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts