చెడ్డి గ్యాంగ్ తరహాలో దోపిడీలు దాడులకు పాల్పడే తార్ గ్యాంగ్ సిటీలో ఎంటర్ అయింది. వీరు మధ్యప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. నగర శివారు ప్రాంతాల ప్రజలే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. ఈ గ్యాంగ్లోని కొందరు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహన్ గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ చేసినట్లు డిసిపి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రహరీపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి ఆ తర్వాత కమ్యూనిటీ లోపలికి చొరపడ్డారు. నాలుగు ఇళ్లల్లో చోరీకి ప్రయత్నించిన ఈ ముఠా ఒక ఇంట్లో దొరికిన నగదు, బంగారం, వెండి వస్తువులను తీసుకువెళ్లారని వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ముఠా కోసం గాలిస్తున్నారు. అయితే చోరీకి పాల్పడిన ముఠా మధ్యప్రదేశ్ తార్కు చెందిన తార్ దొంగలు సిటీలో సంచరిస్తున్నట్లు గుర్తించారు.
మరోవైపు హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఉండే ప్రాంత ప్రజలు రాత్రులు ఒంటరిగా తిరగద్దని.. గ్రామీణ ప్రాంతాల వారు అలర్ట్గా ఉండాలని పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఈ గ్యాంగ్ నగర శివారులోని హోటల్స్లో ఉండి.. పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రులు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్ లో అయిదు మంది ఉంటారని అర్ధరాత్రి ఎవరైనా తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో తీవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వచ్చిన వ్యక్తులు ఎవరో నిర్ధారించుకున్న తర్వాతే ఓపెన్ చేయాలని కూడా స్పష్టం చేశారు. అనుమానంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా వెల్లడించారు. ఈ విధంగా తార్ గ్యాంగ్ కదలికలను గుర్తించాక నగర శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచినట్లు ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు అధికారులు.