May 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు! ఇంతకు వాళ్లు ఏం చేశారు!

 

ఆధునిక యుగంలో కూడా ఇంకా కొన్ని పల్లెలు మూడనమ్మకాల మత్తులో జోగుతున్నాయి. గ్రామస్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కాషాయ దుస్తులు ధరించి స్వాముల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. తాయత్తులు కడతాం.. పూజలు చేస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాగే గ్రామంలోకి స్వాములమంటూ వచ్చిన వారికి ఆ గ్రామస్తులు తిక్కకుదిర్చారు. అసలు ఆ గ్రామం ఏది.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..

వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన కళ్లెం విజయ్, అన్నదమ్ములు జీవన్ లాల్, కృష్ణలు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం పథకం వేశారు. కాషాయ దుస్తులు ధరించి స్వాములు అవతారం ఎత్తారు. ఇంకేముంది అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లారు. తాము ఆంజనేయస్వామి భక్తులమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు. అయితే గ్రామామంలో కిరాణం షాపు నడుపుతున్న పైళ్ల సతీష్-మహాలక్ష్మిల దంపతులకు పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నారు. ఇక పతకం ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లారు. మీపై నరదృష్టి ఉందని, పూజలు చేస్తే అది పోతుందని, కొంత డబ్బు ఖర్చువుతుందని నమ్మబలికారు. బొట్టు పెట్టి తాయత్తు ఇచ్చి రెండు వేల రూపాయలు వసూలు చేశారు. సంతానం లేక బాధపడుతున్న మీకు చెట్ల పసరుతో సంతానం కలిగేలా చేస్తామని అందుకు రూ.18 -రూ.19 వేలు ఖర్చవుతుందని చెప్పారు. మీ ఇంటి దగ్గరే పూజలు నిర్వహించాల్సి ఉంటుందని నమ్మబలికి మళ్లీ వస్తామని వెళ్లారు.


అయితే ఈ దొంగ స్వాముల ప్రవర్తనపై అనుమానం రావడంతో తిరుమలేష్, మహాలక్ష్మి దంపతులు విషయాన్ని స్థానిక మాజీ సర్పంచ్ సతీష్ దృష్టికి తీసుకువెళ్లారు. మరుసటిరోజు ఫోన్‌లో సదరు దొంగ స్వాములతో మాట్లడి పూజలు, తాయత్తుల కోసం రూ.11 వేలకు బేరం కుదుర్చుకొని ఇంటికి రమ్మని పిలిచారు. దీంతో పిలిచిన అరగంటలోనే ఆ స్వాములు గ్రామానికి వచ్చారు. గ్రామస్థులందరూ కలిసి ఆ స్వాములను నిలదీయడంతో వారు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో వారు దొంగ స్వాములని, మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని గ్రహించి గ్రామస్తులు వారిని చితకబాదారు. గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ బాబాలు, స్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు గ్రామస్తులకు సూచించారు.

Also read

Related posts

Share via