April 14, 2025
SGSTV NEWS
CrimeTelangana

బిడ్డను కాపురానికి తీసుకెళ్ళమన్న మామను హతమార్చిన అల్లుడు

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బిడ్డ నిచ్చిన మామని కడతేర్చాడు ఓ అల్లుడు. ఈ ఘటన హాఫీస్‌పేట్ పరిధిలోని ప్రేమ్ నగ‌ర్‌లో చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కూతురుకు అల్లుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా అల్లుడు తీరు మార్చుకోకపోవడమే కాకుండా ప్రతి రోజు గొడవకు దిగుతున్నాడు. ఏకంగా మామను హతమార్చే దాకా వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లోని కన్నారావు బస్తీలో నివాసం ఉండే పల్లపు కృష్టయ్య(75)కు భార్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కరోనా సమయంలో భార్య, కుమారుడు మృతి చెందారు. కృష్టయ్య పెద్ద కూతురు అనితనున రవికుమార్(45)కు ఇచ్చి వివాహం చేశాడు. అనిత, రవికుమార్ ఇద్దరు కన్నారావు బస్తీలోనే ఉంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా రవికుమార్ కు అతని భార్యతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన రవికుమార్ భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది.

అయితే తన కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి అల్లుడే కారణం అంటూ కృష్టయ్య గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రవికుమార్ పక్కనే ఉన్న పారతో కృష్టయ్య తలపై బలంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన కృష్ణయ్యను సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు వైద్యులు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రవికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read

Related posts

Share via