కామారెడ్డి జిల్లాలో తీవ్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరి మృతిదేహాలు చెరువులో లభించాయి. చెరువు కట్టపై ఎస్సై కారు నిలిపివేసి ఉంది. మరి ఎస్సై ఎక్కడ? అసలు ఏం జరిగింది? పోలీసు శాఖలో కలకలం రేపుతోందీ ఘటన.
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువులో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. బిక్కనూరులో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్ కారు, చెప్పులు అక్కడే లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎస్సై, మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్య ఉన్న గొడవలేంటి? ఈ ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్గా శృతి పని చేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు కొనసాగిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. పోలీసు స్టేషన్లో కంప్యూటర్లకు ఏదైన సమస్య వస్తే నిఖిల్ రిపేర్ చేస్తుంటాడు. అయితే ఈ ముగ్గురి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు చేరుకున్న మృతురాలు శృతి బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శృతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని, శృతిని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఆమె తండ్రి. మరోవైపు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం లభ్యం కాకపోవడం అనుమానంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఎస్ఐ కోసం గాలింపు చేపట్టారు
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..