SGSTV NEWS
CrimeTelangana

ఈజీ మనీకోసం కేటుగాడు వేసిన ప్లాన్ చూసి పోలీసుల షాక్..! ఏకంగా రూ. 50 కోట్లు స్వాహా..!



బాలాజీ నాయక్ వడ్డీ చెల్లింపులు వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. దీంతో అనుమానించిన బాధితులు ఏజెంట్లను నిలదీశారు. ఇచ్చిన డబ్బులకు వడ్డీ తోపాటు అసలు కూడా ఇవ్వకపోవడంతో ఇద్దరు బాధితులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. పబ్లిక్ ఫ్రాడ్ అవేర్నెస్ గ్రూప్ పేరుతో పలువురు జిల్లా కలెక్టర్ దృష్టికి కేటుగాడు బాగోతాన్ని తీసుకువచ్చారు.

అతనో సాధారణ యువకుడు. జీవితంలో ఏదో సాధించాలని కలలు కన్నాడు. లగ్జరీగా బతకాలని అనుకున్నాడు. రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్లాన్ వేశాడు. అయితే వీటన్నిటికీ డబ్బే ప్రధానమని భావించాడు. ఈజీ మనీ కోసం జనానికి మాయ మాటలు చెప్పాడు. అధిక వడ్డీ పేరుతో ఆశపెట్టి నమ్మిన జనాన్నీ అడ్డంగా దోచేసి చేశాడు. జనానికి కుచ్చుటోపి పెట్టిన కేటుగాడు చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈజీ మనీకోసం కేటుగాడు వేసిన ప్లాన్ చూసి పోలీసుల షాక్ తిన్నారు.

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామ పరిధిలోని పలుగు తండాకు చెందిన రమావత్‌ బాలాజీ నాయక్‌ సాధారణ యువకుడు. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నాడు. కానీ తన పేదరికం అడ్డు వచ్చింది. 2020లో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు. బంధువుల వద్ద రూ.5 లక్షలు రూ.2ల వడ్డీకి తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టపోయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు అడుగులు వేశాడు. రూ. 6 వడ్డీ చొప్పున అదే గ్రామానికి చెందిన వారి దగ్గర నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈజీ మనీకోసం పథకం వేశాడు. ఇంకేముంది జనానికి మాయ మాటలు చెప్పాడు. అయితే నెలకు వంద రూపాయలకు 2 రూపాయల వడ్డీ అంటేనే కొందరు ఎక్కువని భావిస్తుంటారు. అలాంటిది ఏకంగా రూ.10 నుంచి రూ.16 వరకు ఇస్తామని తెలిసిన వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు.

ఇంకేముంది అధిక వడ్డీ ఆశతో పెద్ద సంఖ్యలో జనం లక్షలాది రూపాయల డబ్బు తెచ్చి బాలాజీ నాయక్ కు అప్పజెప్పారు. తొలుత 10 నుంచి 20 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మించి బంధువుల వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కొన్నేళ్ల పాటు వడ్డీ డబ్బులు సక్రమంగానే ఇచ్చి నమ్మకం కలిగించాడు. ఈ వడ్డీ వ్యాపారం కాస్తా బయటకు పొక్కడంతో తండావాసులు తమ ఇండ్లు, భూములు తనఖా పెట్టడంతో పాటు బయటి నుంచి అప్పులు తెచ్చి మరీ బాలాజీ నాయక్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో కొండమల్లేపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఆఫీసులు ఓపెన్‌ చేసి, తన వ్యాపారం బాగా నడుస్తుందని నమ్మించాడు. మరో వైపు మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు ఆర్థిక సాయం చేస్తూ, ఆలయాలకు విరాళాలు ఇస్తూ అందరి దృష్టిలో పడేవాడు. జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పేద గిరిజనులతో పాటు సామాన్య ప్రజల నుంచి అధిక వడ్డీ రూ.10వరకు ఆశ పెడుతూ వసూలు చేశాడు. సామాన్యులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు అందరూ అధిక వడ్డీ అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో కేటుగాడికి సమర్పించుకున్నారు. ఇలా జనానికి కుచ్చుటోపి పెట్టి సుమారు రూ. 50 కోట్లకు పైగా సేకరించాడు. ఈ డబ్బుతో లగ్జరీ కార్లు, విల్లాలు కొనుగోలు చేసి లగ్జరీ లైఫ్ ను గడిపాడు.

గతేడాది నుంచి బాలాజీ నాయక్ వడ్డీ చెల్లింపులు వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. దీంతో అనుమానించిన బాధితులు ఏజెంట్లను నిలదీశారు. ఇచ్చిన డబ్బులకు వడ్డీ తోపాటు అసలు కూడా ఇవ్వకపోవడంతో ఇద్దరు బాధితులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. పబ్లిక్ ఫ్రాడ్ అవేర్నెస్ గ్రూప్ పేరుతో పలువురు జిల్లా కలెక్టర్ దృష్టికి కేటుగాడు బాగోతాన్ని తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం బాలాజీ నాయక్ మోసాలపై కూపీ లాగింది.

వద్దిపట్లలోని బాలాజీ నాయక్ ఇంటిపై కొద్ది రోజుల క్రితం బాధితులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బాధితుల ఆందోళనతో జిల్లా పోలీసులు అతడిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. బాలాజీ నాయక్ మోసాలపై బాధితులు ప్రజాసంఘాల ఒత్తిడితో పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి బాలాజీ నాయక్ పాల్పడ్డాడని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అధిక వడ్డీ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు

Also read

Related posts