రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కార్యక్రమాల కోసం గ్రామానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్ గ్రామాన్ని విషాదఛాయలతో ముంచెత్తింది. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా వాసులైన వలిదాసు కృష్ణయ్య, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. స్నేహాన్షి (4), శ్రీజ (2) ఉన్నారు. కుటుంబ బంధువుల సంవత్సరీకం, మరొక బంధువు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో, లలిత ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఇల్లు చిన్నలింగాపూర్కు వచ్చారు. గ్రామంలో ఏర్పాటైన రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు సంతాపంలో నిమగ్నమై ఉన్న తరుణంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారిని విషసర్పం కాటు వేసింది.
ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారి స్నేహాన్షిని పాము కరిచింది. దీంతో బాలిక హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యంలోనే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రులు తట్టుకోలేని దుఃఖంతో బోరున విలపించారు. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో.. సందడితో తిరిగిన చిన్నారి మృతదేహాన్ని చూస్తూ.. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య తరచుగా పాము కాట్లు కేసులు నమోదవుతున్నాయి.. వర్షాలు పడుతుండటంతో పాములు సంచరించే అవకాశం ఉందని.. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చిన్నపిల్లలను ఒంటరిగా బయటికి వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!