July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : వైన్‌ షాపు సిబ్బంది నిర్వాకం.. బీరు అడిగినందుకు చావగొట్టి, ప్రాణం తీశారు!

మూసాపేట, మే 15: బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్‌ షాపు నిర్వాహకులు. ఈ దాడిలో యువకుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మూసాపేటలోని అడ్డాకుల మండలంలోని బలీద్‌పల్లి గ్రామానికి చెందిన ముష్టి శ్రీ కాంత్‌ (26) గత నెల 26న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న సాయి మల్లికార్జున వైన్స్‌ వద్దకు వెళ్లాడు. బీర్‌ కావాలని షాప్‌ నిర్వాహకులను అడిగాడు. అయితే వైన్స్‌ నిర్వాహకులు ఎంతకూ బీరు ఇవ్వకపోగా.. శ్రీకాంత్‌ను పట్టించుకోకుండా మాట్లాడుకోసాగారు. దీంతో విసిగెత్తిపోయిన శ్రీకాంత్‌ తనకు త్వరగా బీర్లు ఇవ్వాలని కోరాడు. అలా అడగడమే పాపమైపోయింది. దీంతో షాకు నిర్వాహకులు దురుసుగా సమాధానం ఇవ్వడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. రెచ్చిపోయిన వైన్స్‌ షాప్‌ నిర్వాహకులు.. మరో పది మందిని తీసుకొచ్చి శ్రీకాంత్‌ను బలవంతంగా షాపులోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత పిడిగుద్దులతో విచక్షణారహితంగా చావగొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన శ్రీకాంత్‌ను బంధువులు, స్నేహితులు వచ్చి స్వగ్రామానికి తీసుకెళ్లారు

కాసేపటికే కడుపులో నొప్పి రావడంతో శ్రీకాంత్‌ను కొత్తకోటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్‌పై దాడి గురించి అదే రోజు మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో శ్రీ కాంత్‌ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి కాలేయం, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు శ్రీకాంత్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీకాంత్‌ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

తమ బిడ్డను పొట్టన బెట్టుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో మహబూబ్‌నగర్‌ రూరల్‌ సీఐ గాంధీ నాయక్‌ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Also read

Related posts

Share via