SGSTV NEWS
CrimeTelangana

Nalgonda: భర్తే నిందితుడు.. అంగన్వాడీ టీచర్ మృతి కేసును ఛేదించిన పోలీసులు



నల్గొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనూష మృతి కేసును పోలీసుల ఛేదించారు.మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో అంగన్వాడీ  టీచర్ అనూష మృతి కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతో భర్త సైదులే ఆమెను సాగర్ ఎడమ కాలువలోకి నెట్టి పథకం ప్రకారం ప్రమాదంగా చిత్రీకరించినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో సైదులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లికి చెందిన అనూష, సైదులు 16 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతకొంతకాలంగా అనూష వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం భర్త సైదులకు ఉంది. దీంతో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అంగన్వాడీ కార్యకర్త అయిన అనూషకు ఇటీవల కామేపల్లికి బదిలీ అయింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం విధులు ముగిసిన అనంతరం అనూషను తీసుకుని కామేపల్లి నుంచి వేములపల్లికి బైక్పై బయల్దేరాడు సైదులు. మార్గమధ్యలో అనూషను సాగర్ ఎడమకాలువలోకి నెట్టేశాడు. బైక్తో పాటు
కాలువలో పడిపోయామని.. తన భార్య గల్లంతైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సైదులును విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కుట్ర బయటపడింది. అనూష అడ్డు తొలగించుకొని మరో వివాహం చేసుకునేందుకు భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది

Also read

Related posts