కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వేసవిలో కొబ్బరి నీళ్లు యమ డిమాండ్ ఉంటుంది. ఇది శరీరంలోని నీటి లోటును తీర్చడమే కాకుండా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కూడా అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తాగడం సురక్షితమేనా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిపుణుల మాటల్లో మీ కోసం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీళ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇవి అంత మంచిది కాదు. రోగి మూత్రపిండాల వ్యాధి దశ, క్రియేటినిన్, పొటాషియం స్థాయిల ఆధారంగా దీని వాడకాన్ని నిర్ణయించాలి. రక్తంలో అధిక పొటాషియం స్థాయిలు ఉన్న మూత్రపిండాల రోగులు కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి. ఇది శరీరంలో పొటాషియంను మరింత పెంచి, ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా దీనిని సేవించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఎప్పుడు సురక్షితం?
తేలికపాటి మూత్రపిండాల సమస్యలు ఉండి పొటాషియం, క్రియేటినిన్ స్థాయిలు సాధారణంగా ఉన్నవారికి కొబ్బరి నీళ్లు తాగడం ప్రయోజనకరం. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఖనిజాలను సమకూరుస్తుంది. కాబట్టి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు తమ పరిస్థితిని బట్టి, వైద్యుని సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు తాగడం సురక్షితం.
మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ నియమాలు పాటించండి..
రోజుకు 7–8 గ్లాసుల నీళ్లు తాగాలి.
ఉప్పు తీసుకోవడాన్ని నియంత్రించాలి.
ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
