హనీట్రాప్ నిందితురాలు కొరుప్రోలు జాయ్ జెమీయా కేసులో ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురినీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
మాధవధార (విశాఖపట్నం): హనీట్రాప్ నిందితురాలు కొరుప్రోలు జాయ్ జెమీయా కేసులో ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజిమన్లను హైదరాబాద్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టులో హాజరు పరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం పీటీ వారెంట్పై వీరిని విశాఖ కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు. బాధితుల మీద ఉపయోగించిన మత్తు పదార్థాలు, స్ప్రేలు సరఫరా చేయడంలో ఈ ముగ్గురు నిందితులు కీలక పాత్ర పోషించారని, ఇందుకు గాను భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి స్ప్రేలు, వివిధ రకాల మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వేణు భాస్కరరెడ్డిని నవంబర్ 30న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జాయ్ జెమీయా దందా ఇలా…
హైదరాబాద్కు చెందిన బాధితుడు విశాఖలోని ఒక కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ యజమాని బంధువుగా వచ్చిన జామ్ జెమీయా ప్రాజెక్టు హెడ్గా తనను నియమించారని, వర్క్ కోసం ప్రతి రోజు బాధితుడి వద్దకు వచ్చి పరిచయం పెంచుకుంది. బాధితుడి ముఖంపై మత్తు స్ప్రే చల్లి, జ్యూస్లో మత్తు మందు ఇచ్చి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోలు తీసింది. అప్పటి నుంచి ప్రతిసారీ వేధింపులకు గురిచేస్తూ, అందినకాడికి దోచుకుంది. నగదు ఇవ్వలేని పక్షంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను అతడి భార్య, బంధువులకు పంపిస్తానని బెదిరించేది. దీంతో ఆమె అడిగినంత నగదును ఇచ్చేవాడు.
చివరిగా రూ.3 కోట్లు ఇస్తే పూర్తిగా వదిలేస్తానని చెప్పడంతో, ఆ నగదు సమకూరుస్తానని నమ్మబలికి బంగారం, డబ్బులు, ల్యాప్టాప్ తీసుకొని హైదరాబాద్ వెళుతుండగా అది తెలుసుకుని మార్గ మధ్యలో బాధితుడి కారుని ఆపి, అతడి వద్ద ఉన్న వస్తువులన్నీ లాక్కొని కత్తితో చంపేందుకు ఆమె, ఆమె సహచరులు ప్రయత్నించారు. దీంతో వెంటనే వారి నుంచి తప్పించుకొని బాధితుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆమె చేతిలో మోసపోయిన ఎన్ఆర్ఎ యువకుడి ఘటన వెలుగులోకి వచ్చి ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో, బాధితుడు ఎయిర్పోర్టు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జాయ్ జెమీయా మోసాలు ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని బాధితులు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
Also Read
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?
- Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
- నేటి జాతకములు…15 మార్చి, 2026
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!





