July 3, 2024
SGSTV NEWS
CrimeNational

ఇదేం ఘోరం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. 3 రాత్రులు శవాలతో గడిపి..!

లక్నో, ఏప్రిల్‌ 1: అనుమానం పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో కట్టుకున్నోడు కన్న బిడ్డల కళ్లెదుటే దారుణంగా హత్య చేశాడు. పిల్లలు ఎక్కడ సాక్ష్యం చెబుతారనే అనుమానంతో ఇద్దరు బిడ్డలనూ హతమార్చి తన పాపానికి ఆధారాలు లేకుండా చేశాడు. కానీ విధి మాత్రం అతన్ని వదల్లేదు. పోలీలకు పట్టించి కటకటాలపాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్‌ ఏరియాలోగల శరవణ్‌ నగర్‌ ఏరియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సౌత్ అడిషనల్ డీసీపీ శశాంక్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..

లక్నో జిల్లాలోని బిజ్నోర్‌ ఏరియాలోగల శరవణ్‌ నగర్‌ ఏరియాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోన్న రామ్‌లగన్‌ గౌతమ్‌ (32)కు భార్య జ్యోతి (30), ఇద్దరు పిల్లలు పాయల్‌ (6), ఆనంద్‌ (3) ఉన్నారు. రామ్‌లగన్‌ తాపీ పని చేసుకుంటూ కాపురాన్ని పోషించేవాడు. 14 ఏళ్ల క్రితం గౌతమ్‌ ముంబైలోని కళ్యాణ్‌పూర్‌లో పనిచేసేవాడు. అక్కడే స్థానికంగా ఉంటోన్న జ్యోతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట లక్నోకు మారారు. సరోజినీ నగర్‌లోని గౌరీబజార్‌లో తాపీ మేస్త్రీగా పనికి కుదిరాడు. ఆ తర్వాత బిజ్నోర్‌లోని సర్వన్ నగర్‌లోని మరో అద్దె ఇంట్లోకి మారారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినా ఈ మధ్యకాలంలో భార్య జ్యోతి తరచూ ఫోన్‌లో మాట్లాడుతుడంపై గౌతమ్‌కు అనుమానం మొదలైంది. జ్యోతి ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గౌతమ్‌ అనుమానించాడు. ఈ విషయమై భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. భార్య ఎంతచెప్పినా అనుమానం వీడని గౌతమ్‌ మార్చి 28న రాత్రి భార్యతో మరోమారు గొడవపడ్డాడు.

ఈ క్రమంలో పిల్లల కళ్ల ముందే నిద్రిస్తున్న జ్యోతిని, ఆమె చీర కొంగుతో మెడకు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. భార్యను తానే చంపినట్లు పోలీసులకు ఎక్కడ చెబుతారోనని భయంతో ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. అనంతరం రాత్రంతా ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే గడిపి మరుసటి రోజు ఉదయం ఎప్పటి మాదిరిగానే తలుపుకు తాళం వేసి విధులకు వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగొచ్చి పడుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత మూడు రోజులు కూడా అదే రొటీన్‌ను కొనసాగించాడు. రోజూ రాత్రి అదే గదిలో పడుకుని పగలు పనికి బయటకు వెళ్లేవాడు. అయితే గౌతమ్‌ నివాసం ఉంటోన్న ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గది తాళం పగులగొట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. సౌత్ డీసీపీ తేజ్ స్వరూప్ సింగ్, ఏడీసీపీ శశాంక్ సింగ్, కృష్ణానగర్ ఏసీపీ వినయ్ ద్వివేది సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు గౌతమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సౌత్ అడిషనల్ డీసీపీ శశాంక్ సింగ్ తెలిపారు.

Also read

Related posts

Share via