SGSTV NEWS
CrimeNational

మరీ ఇలా తయారయ్యారేంట్రా.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోసిన ఫ్రెండ్స్.. ఎక్కడంటే?



కొన్ని సార్లు మనం సరదా కోసం చేసే పనులు.. ఏకంగా మన ప్రాణాలకే ప్రమాదం తేవచ్చు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోనూ అలాంటి సంఘటనే వెలుగు చూసింది. హాస్టల్‌లో రాత్రి నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కల్లలో ఫెవిక్విక్‌ పోశారు తోటి విద్యార్థులు. దీంతో సదురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.


ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్‌లోని సలగూడా సెబాశ్రమ్ విద్యాలయంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో ఓ రాత్రి నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్లలో వారి సహ విద్యార్థులే ఫెవిక్విక్ పోశారు. దీంతో విద్యార్థుల కళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. పూర్తిగా కళ్లు కూడా తెరవలేని స్థితికి చేరుకున్నారు ఆ పిల్లలు. దీంతో వెంటనే వారిని దగ్గరలోని గోఛాపడా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఫుల్బాని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అందులో ఏడుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి మెరుగుపడి ప్రమాదం తప్పడంతో డిశ్చార్జ్ చేశారు. హాస్టల్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య సాధారణంగా జరిగే గొడవల కారణంగానే ఇలా ప్రవర్తించినట్లు సమాచారం. ఆ గొడవ కాస్తా తీవ్రస్థాయికి చేరి తమతో గొడవ పెట్టుకున్న వాళ్లను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో కళ్లల్లో ఫెవిక్విక్ పోసి ఆకతాయిగా చేసిన చర్యే ఇంతటి అనర్థానికి దారి తీసిందని ప్రాథమిక అంచనా.


వైద్యుల సమాచారం ప్రకారం.. విద్యార్థులకు సమయానికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని, అయితే మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సైతం స్పందించారు. విద్యార్థుల క్రమశిక్షణ లోపానికి ఉపాధ్యాయులే కారణంగా చూపుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కానీ, ఘటన సమయంలో ఆయన పాఠశాలలో లేరని తెలిసింది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్‌ల నిర్లక్ష్యం ఏంటి? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. విద్యార్థుల వద్దకు ఫెవిక్విక్ వంటి ప్రమాదకర పదార్థం ఎలా చేరిందో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

అయితే.. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో ప్రధానంగా ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు. అలాంటి చోట భద్రతా లోపాలు రావడం తల్లిదండ్రుల్లో, స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లా సంక్షేమ అధికారి స్వయంగా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కలెక్టర్ లోతైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా పాఠశాలలలో కఠినమైన నియమాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts

Share this