July 1, 2024
SGSTV NEWS
CrimeNational

షూట్‌ విషయంలో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యూట్యూబ్‌ జంట

క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన  జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్‌కు చెందిన గర్విత్‌ 25, నందిని 22గా గుర్తించారు.

గర్విత్‌, నందిని ఇద్దరూ కంటెంట్‌ క్రియేటర్స్‌, సొంతంగా ఛానల్‌  పెట్టి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రీల్స్‌, షార్ట్‌ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్‌తో కలిసి డెహ్రడూన్‌ నుంచి బహదూర్‌ఘర్‌కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్‌లోని మరో అయిదుగురు రూమ్‌మేట్స్‌తో జీవిస్తున్నారు.



ఈ క్రమంలో బయట షూటింగ్‌ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్‌ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్‌ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share via