SGSTV NEWS
CrimeTelangana

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు…108 సర్టిఫికెట్లు స్వాధీనం


ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కన్సల్టెన్సీపేరుతో ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 108 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Fake Certificates Issue: జాబ్‌ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌(Hyderabad) సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన సర్టిఫికెట్లను తయారు చేసి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో  ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన పోలీసులు మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న సమయంలో నిందితుడు ముజీబ్ హుస్సేన్‌ను పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల అదుపులోకి
ముజీబ్‌ ఇచ్చిన సమాచారంతో ఈ ముఠాలోని రహమాన్, సిద్ధిఖీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కలసి కోల్‌కతా కు చెందిన మనోజ్‌ విశ్వాస్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవీందర్, ముఖేష్‌ల నుంచి ఈ నకిలీ సర్టిఫికెట్లు సేకరించి హైదరాబాద్‌లో నిరుద్యోగులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరివద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన 108 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సరిఫికెట్లను విద్యార్థులను, నిరుద్యోగులను నమ్మించి నిజమైన సర్టిఫికెట్లుగా ప్రచారం చేసి విక్రయించి మోసం చేస్తున్నారని పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నాసిర్‌ అనే విద్యార్థిని  కూడా అరెస్ట్ చేశారు.  ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి విద్యార్థులు మోస పోవద్దని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.

Also read

Related posts

Share this