SGSTV NEWS online
CrimeTelangana

Telangana: ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి.. ఎందుకో తెలిస్తే..



తమ ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ చల్లగా వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు. కన్నబిడ్డలపై దాడి చేసిన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూతురు ప్రాణాలు కోల్పోగా, కొడుకు ప్రాణాలతో బయట పడ్డాడు. యాదాద్రి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డికి భువనగిరి మండలం తుక్కాపురంకు చెందిన నీలిమకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు కృతిక (14), కుమారుడు అక్షిత్ రెడ్డి (11) ఉన్నారు. వీరి కాపురం సజావుగానే సాగుతోంది. అయితే గత కొంతకాలంగా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోంది. నీలిమకు మానసిక ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి జైనపల్లి నుండి భువనగిరికి వచ్చి రెండేళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి జైనపల్లికి మకాం మార్చారు.

నీలిమ పిల్లల పట్ల ఎక్కువగా కేర్ తీసుకునేది. టీవీ, సెల్ ఫోన్‌లకు దూరంగా ఉంచే ప్రయత్నం చేసేది. ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకువచ్చేదని బంధువులు చెబుతున్నారు. అనుకున్నదే తడువుగా ఏ పనైనా చేయాలనే నీలిమ మనస్తత్వంతో పిల్లలు ఇబ్బంది పడేవారట. ఈ నేపథ్యంలో నిన్న తుక్కాపురం వెళ్లాలని పట్టుబట్టడంతో భర్త నరేందర్ రెడ్డి సాయంత్రం భార్య పిల్లలు ఇద్దరినీ తుక్కాపురంలో విడిచి వెళ్ళాడు. అందరు కుటుంబ సభ్యులు భోజనం చేసి పడుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున నీలిమ కత్తితో తన ఇద్దరు పిల్లలపై దాడి చేసింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృతిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తర్వాత కొడుకు అక్షిత్ రెడ్డి పై దాడి చేసే క్రమంలో తప్పించుకొని బయటకి వచ్చి కేకలు వేస్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి నీలిమ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో నీలిమను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే నీలిమ కొంతకాలంలో మతిస్థిమితంతో బాధపడుతూ ఉందని సోదరుడు చెబుతున్నారు.నీలిమ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts