SGSTV NEWS online
CrimeTelangana

చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత..



పూజలు, ప్రత్యేక పరిహారాల పేరుతో లక్షల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై పూజారి చామర్తి రామ లచ్చారావును శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.20 లక్షలు మోసం చేసిన కేసుతో పాటు అమెరికాలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


పూజలు, పరిహారాలు చేస్తానంటూ నమ్మించి లక్షల రూపాయలు మోసం చేసిన ఓ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టయిన వ్యక్తిని చామర్తి రామ లచ్చారావుగా పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రూ.20 లక్షలు మోసం చేయడమే కాకుండా.. చేతబడి చేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విదేశాలకు వెళ్లిపోవడంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.


ఇదే సమయంలో అమెరికాలో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. అమెరికాలో అతడు నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధించిన వివాదాలు, అక్కడ నమోదైన కేసుల నేపథ్యంలో భయంతో భారత్‌కు తిరిగి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. అనంతరం సంబంధిత పోలీసులకు అప్పగించారు.

ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చామర్తి రామ లచ్చారావు మోసాల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూజలు, ప్రత్యేక పరిహారాలు, చేతబడి తొలగిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also read

Related posts