వేసవి సెలవులు కావడంతో అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు.. అప్పటిదాకా కేరింతలతో, పిల్లల అల్లరితో ఆ కాలనీ అంత సందడిగా కొనసాగింది. ఉరుకులు పరుగులు దాగుడు మూతల ఆటలతో చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. వేసవి సెలవులు మొదలైన రోజు నుండి ప్రతి రోజు సాయంత్రం ఆటల్లో మునిగిపోవడం చిన్నారులకు సరదగా మారింది. కానీ ఆ సరదానే ప్రాణాలు తీస్తుందని.. రోజు ఆడే దాగుడు మూతల ఆటే మృత్యువుగా మారుతుందని ఆ చిన్నారి అనుకోలేదు. దాగుడు మూతలు ఆడే క్రమంలో ఓ ఇంటి గోడ వద్ద దాక్కున్న ఆ చిన్నారిని ఆ గోడే మృత్యువులా మారి మింగేసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో గోడ కూలి ఏడేళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. స్నేహితులతో కలిసి ఎప్పటిలాగే దాగుడు మూతలు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలి మీద పడటంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. పక్కనే ఉన్న మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. అచ్చలపూర్ గ్రామానికి చెందిన ఏముర్ల శేఖర్, భాగ్య దంపతులకు సునైత్రి(7), శ్రీరామ్ లు సంతానం. పాప సునైత్రి తాండూరు మండల కేంద్రంలోని శ్రీ వాణినికేతన్ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. మరో ఐదు రోజుల్లో సెలవులు ముగిసి పాఠశాలకు వెళ్లాల్సిన తరుణంలో ఇంటికి దగ్గరలో ఉన్న ఇంటి గోడ కూలి బాలిక మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
కళ్ళ ముందు కన్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృత్యు పాశమైన ఇంటి గోడ ముక్కు పచ్చలారని ఏడేళ్ల చిన్నారిని బలి తీసుకోవడంతో అచ్చలాపూర్ లో విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు.
Also read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు!





