భార్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతుండడంపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేపింది. ఘటన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెనాలి, జూలై 16: తెనాలికి చెందిన నరేంద్రబాబుకు పల్నాడు జిల్లా నూజెండ్లకు చెందిన సంధ్యారాణి (27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం ప్రస్తుతం తెనాలి మండలం అంగలకుదురులో నివాసం ఉంటోంది. నరేంద్రబాబు తెనాలి చెంచుపేటలోని ఓ మద్యం దుకాణం సమీపంలో పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిసైన నరేంద్రబాబు తన సంపాదనను కుటుంబ ఖర్చులకు ఇవ్వకుండా తరచూ భార్యతో గొడవపడేవాడని సమాచారం. ఈ కారణంగా సంధ్యారాణి పలుమార్లు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లగా, పెద్దల జోక్యంతో తిరిగి కాపురానికి వచ్చేది. ఇటీవల సంధ్యారాణి ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతుండటంతో నరేంద్రబాబులో అనుమానం పెరిగింది. ఈ క్రమంలో ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో ముందుగానే ఒక పెద్ద కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 10న మద్యం సేవించి ఇంటికి వచ్చిన నరేంద్రబాబు భార్యతో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సంధ్యారాణి.. ‘ఇలా కొనసాగితే పుట్టింటికి వెళ్లిపోతాను, ఇక తిరిగి రాను’ అని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన నరేంద్రబాబు ఇంట్లో దాచిన కత్తిని తీసుకుని ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందింది. దాడి సమయంలో నిందితుడి చేతికి కూడా గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు పట్టుకుంటారనే భయంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. చికిత్స అనంతరం నరేంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, హత్య జరిగిన రోజు ఉదయం సంధ్యారాణి తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి భర్త వేధింపుల గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. నరేంద్రబాబు ప్రవర్తన మారలేదని, తనకు ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉందని ఆమె భయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వ్యక్తం చేసిన ఆందోళన నిజమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందనీ.. కత్తితో పొడిచి హతమార్చిన భర్త!
- Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్
- పద్దతిగా భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్తో కలిపి లేపేసింది.. ఏపీలో సంచలనం
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?





