SGSTV NEWS online
Andhra PradeshCrime

కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు



కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తుండగా ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పి, గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు.


నర్సమ్మ కళ్లలో కారం కొట్టి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన స్థానిక శానిటేషన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సమ్మను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నర్సమ్మ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ దాడికి గల కారణాలు ఏంటి? వీళ్లకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also read

Related posts