July 1, 2024
SGSTV NEWS
Crime

షాది డాట్ కామ్‎లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..

ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదేపదే ఒకే రకమైన నేరానికి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా రూ.40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఒక యువతి. షాది డాట్ కామ్ వెబ్సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతీకి శర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నమ్మించాడు. తాను త్వరలోనే ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని మొదట యువతిని మభ్య పెట్టాడు. ఆ తర్వాత తరచుగా యువతి తో వీడియో కాల్స్ మాట్లాడుతూ చాలా చనువుగా ఉండేవాడు. ఒకరోజు ఉన్నపళంగా ఫోన్ చేసి తాను ఇండియా వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతిని నమ్మించాడు. తాను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఉన్నానని మనీ ఎక్స్చేంజ్ కోసం తనకి రూ.40 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చినా ఏమీ కాదని ఉద్దేశంతో యువతి రూ.40 లక్షలు నిందితుని ఖాతాకు పంపించింది.

యువతి డబ్బులు పంపిన క్షణం నుండి నిందితుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించింది. ఎవరు కూడా మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తులు డబ్బులు అడిగితే చెల్లించవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి ఘటనాలకు పాల్పడి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. మాట్రిమోనీ సైట్ల ద్వారా ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకరకాల మ్యాట్రిమోనీ సైట్లలో వేలాదిమంది సభ్యులు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎన్నారైలమని నమ్మించి వివిధ మార్గాల్లో అమాయకుల నుండి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also read

Related posts

Share via