October 16, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఏపీలో ప్రతినెలా 1వ తేదీన ‘పేదల సేవలో’ మమేకం… జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం

‘గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు. నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలి. ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో‘ కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకమవ్వాలి.’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ బ్రాండ్ మళ్లీ నిలబెట్టుకోవాలన్నారు.

ఇది జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన తొలి సమావేశం కాగా..  కలెక్టర్ల ద్వారా మంచి పరిపాలన జరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పాలనలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. సమర్థవంతంగా పథకాల అమలు జరగాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా ఫిర్యాదులు స్వీకరించి.. సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే…?

‘ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలి. మానవీయ కోణంలో స్పందించాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేది అధికారులు వినాలి. వారి ఆలోచనలు అమలు చేయాలి. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారాన్ని అధికారులు కూడా తిప్పికొట్టాలి. అధికారులు, శాఖలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మంచిని చెప్పాలి. తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలి. జిల్లా స్థాయిలో కూడా విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలి. 100 రోజుల్లో మార్పు కనిపించాలి.

ఈరోజు నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ చారిత్రాత్మకమైనది. 1995 నుంచి నేను విధిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి దిశానిర్దేశం చేస్తున్నాను. ఈరోజు నిర్వహించే కాన్ఫరెన్స్ చరిత్రను తిరగరాయబోతుంది. ఐదేళ్ల క్రితం ప్రజా వేదికలో నిర్వహించిన  కాన్ఫరెన్స్ తో విధ్వంసానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను విధ్వంసం చేశారు. గత ప్రభుత్వ తీరుతో బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నది. గత ప్రభుత్వ విధానాలతో అధికారుల మనోభావాలను దెబ్బతీశారు. మా హయాంలో ఏపీ నుండి వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కేంద్రంలో స్థాయిల్లో ఉన్నారు. వరల్డ్ బ్యాంకుకు వెళ్లారు. వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చు. మొత్తంగా విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే భారీ కసరత్తు చేయాలి. అహర్నిశలు కష్టపడాలి. మనం తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఉపయోగపడాలి.’

‘1995లో ఆర్థిక సంస్కరణలు రాకముందు భారత్ లో 3 శాతం గ్రోత్ రేట్ ఉంది. సంస్కరణల అనంతరం కాంపిటేటివ్ గ్రోత్ వచ్చింది. 2047కి ప్రపంచంలో భారత దేశం నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. 2029లో 3వ లార్జెస్ట్ ఎకానమీకి మనం రీచ్ అవుతాం. రాష్ట్రానికి హిస్టారికల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. గతంలో 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టం తీసుకువచ్చాం. అనంతరం వచ్చిన పాలకులు దాన్ని విధ్వంసం చేయలేదు. కాబట్టే అభివృద్ధి కొనసాగింది. కానీ ఏపీలో మాత్రం అలా చేయకపోవడం వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్లింది.’

ప్రపంచంలో అత్యధిక పర్ కాపిటా ఇన్‌కమ్‌ ఇండియాది. మేం గత ఐదేళ్లలో అన్ని విధాల ఇబ్బందులకు గురయ్యాం. ఎప్పుడూ లేని విధంగా ప్రజలు మా కూటమికి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. నాడు ఎన్నికల హామీలో ప్రజలు గెలవాలి. ఎన్డీయేకు ఓట్లు వేయాలి అని కోరాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం. ప్రజలు గెలిచారు.. మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి.’

‘గడిచిన ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టలేదంటే పరిపాలన ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. ఇకపై గంటల తరబడి, రోజుల తరబడి కాన్ఫరెన్స్ ఉండబోదు. అధికారులు జవాబువాదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కీలక శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. అభివృద్ధితోనే ఆదాయం, ఆదాయం వస్తేనే ప్రజలకు ఖర్చు చేయగలుగుతాం. అభివృద్ధితోనే ప్రజలకు సంతృప్తి ఉంటుంది. మెరుగైన పాలన అందించడం మా బాధ్యత.. దానికి మేం కట్టుబడి ఉంటాం.’

ఐఏఎస్ కావడం ఒక కల. కలెక్టర్‌గా పనిచేయడం పెద్ద డ్రీమ్. పని చేస్తే అధికారులను ప్రోత్సహిస్తాం. అధికారులు మానవతాదృక్పథంతో పనిచేయాలి. ఉత్తమ కలెక్టర్ గా తమకు తాము మార్క్ క్రియేట్ చేసుకోవాలి. ఆ లక్ష్యంతో పనిచేయాలి. అదే సంకల్పం బూనాలి. ఆ దిశగా ముందుకు వెళ్లాలి. 2014న రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వచ్చాయి. 2019లో వచ్చిన అడ్మినిస్ట్రేషన్ తో చాలా నష్టపోయాం. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. మంచి పరిపాలనతో ప్రజలకు మెరుగైన పాలన, జీవన ప్రమాణాలు అందించాలి. మాకు వచ్చిన 5వేల పిటిషన్లలో సగం భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీన్ని బట్టి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.’

‘నా 14 ఏళ్ల కెరీర్ లో ఇంత విధ్వంసం చూడలేదు. తొలి కేబినెట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. సర్వేను హోల్డ్ లో పెట్టాం. సర్వే రాళ్లపై ఫోటో పెట్టుకోవాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన. పట్టాదారు పాస్ పుస్తకాలలో ఫోటో పెట్టుకోవడం అన్యాయం. వారసత్వ ఆస్తులపై ఫోటో లు ముద్రించుకోవడం దుర్మార్గం. కలెక్టర్లు, అధికారులు సరికొత్త, వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించాలి. మన ప్రభుత్వం సంక్షేమంపై దృష్టిసారిస్తుంది. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీ3) తో భిన్నంగా ముందుకువెళ్లాం. విజయం సాధించాం. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్(పీ4) మోడల్ తో ముందుకు వెళ్దాం.’

ప్రస్తుతం పెన్షన్లపై నెలకు రూ.2,730 కోట్లు, ఏడాదికి 33వేల కోట్లు, ఐదేళ్లకు 1,63, 000 కోట్లు  ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం తప్ప, ప్రజలను పరామర్శించలేదు. మీటింగులకు బలవంతంగా మనషులను తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు. త్వరలోనే “పేదల సేవలో” అనే కార్యక్రమం క్రింద మనం అనుసంధానం అవుదాం. పేదవారిని చూసినప్పుడు మనసు చలించాలి. ఏం చేస్తే పేదరికం పోతుందో ఆలోచించాలి.’

‘జీరో పావర్టీ అనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ రావాలి. ప్రజల జీవనప్రమాణాలు మెరుగయ్యేలా చేయాలి. మానవతా ధృక్ఫథంతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం చేయగలం. అలాంటి ఆలోచనకు అధికారులు శ్రీకారం చుట్టాలి. ప్రభుత్వంలోఎవరూ పెత్తందారి వ్యవస్థలా ప్రవర్తించకూడదు. అసహ్యంగా మాట్లాడకూడదు. అనవసరంగా దూషించవద్దు. ప్రతి శనివారం సీఎంవో ఎలా పనిచేస్తుందో రివ్యూ చేసుకుంటున్నాం. నియంత(డిక్టేటర్)లు అనుకున్నవాళ్లు ఎవరూ మళ్లీ గెలవలేదు. ఎవరూ తప్పులు చేయకూడదు. ప్రజా ప్రతినిధులు వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు సంబంధిత సమస్యలను పరిష్కరించాలి. నాయకత్వం అంటే ఓనర్ షిప్ గా భావించాలి. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఓన్ చేసుకోవాలి. సమర్థవంతంగా పనిచేయాలి. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండాలి. నేను పర్యటనలకు వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, పరదాలు కట్టడం, స్కూలు బంద్ చేయడం, రెడ్ కార్పెట్లు వేయడం ఇలాంటివి చేయకూడదు. సరికాదు.’

ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దు. ఎమ్మెల్యేలు సైరెన్ వేసుకోవడం వంటివి ప్రజల్లో వ్యతిరేకత కలిగించేవి. అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ మోడ్ లో వెళ్లాలి. విజిబుల్, ఇన్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. నాడు 15వేల సీసీ కెమెరాలు రాష్ట్రంలో పెట్టాం. మారుమూల గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్ గా తీసుకెళ్లే పరిస్థితులు వచ్చాయి. టెక్నాలజీ, మంచి నాయకత్వం, చేయగలిగే సత్తా ఉండాలి. ఏదైనా సాధించవచ్చు. వర్చువల్ గవర్నెన్స్ రావాలి. అధికారులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. టీసీఎస్ కంపెనీలో ఒక గ్రూప్ ఉంది. అందులో అందరూ ఉంటారు. సమన్వయం చేసుకుంటారు. త్వరలో గవర్నమెంట్ కు కూడా ఒక యాప్ తీసుకొస్తాం. అప్పుడే రియల్ టైమ్ లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. మంచిని చెప్పడం, ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలి. ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ సిద్ధం చేద్దాం.’

భట్టిప్రోలు ఘటనలో ఒక కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నారని కల్పిత కథనం రాశారు. మనం వాస్తవాలు వెల్లడించకపోతే నిజమనుకునే అవకాశం ఉంది. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం. ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ఏపీలో 36 మందిని చంపామని నినదించారు. నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్ఐఆర్‌లు ఇవ్వాలి. కానీ ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలుంటే చూపించాలి. ప్రభుత్వంపై ఇలా వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తారు.. జాగ్రత్తగా ఉండాలి.కష్టపడి పనిచేస్తే ఆ ఫలితం రాకపోగా విష ప్రచారం చేయడం మొదలుపెడతారు.’

వికసిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కావాలి. అక్టోబర్ 2న మన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తాం. కలెక్టర్లు డిస్ట్రిక్ విజన్ డాక్యుమెంట్ తయారుచేయాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. ఇప్పటికే 5 సంతకాలు పెట్టాం. 7 శ్వేత పత్రాలు విడుదలచేశాం. విజన్ 2020ని అప్పట్లో ఎగతాళి చేశారు. చేసి చూపించాం. అలాగే కొత్త విజన్ ను ఆలోచించాలి. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను పెట్టబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుంది. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ను ముందుగా పరిష్కరించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలి. తద్వారా మంచి మార్పు వస్తుంది.’

త్వరలోనే మళ్లీ 1995 చంద్రబాబు నాయుడును చూస్తారు. హైదరాబాద్, ఐటీ అభివృద్ధిని అధికారులే చేశారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ద్వారా పనులు చేయించాలి. అంగన్వాడీకి వెళ్తా, డ్రైయిన్ కు వెళ్తా.. అధికారులు ప్రజల కనీస అవసరాలను గుర్తించాలి. గ్యాస్, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, సిమెంట్ రోడ్లు, వేస్ట్ మేనేజ్ మెంట్ తదితర సమస్యలు గుర్తించి పరిష్కరించాలి. టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత పెట్టుబడులు పెట్టారన్నది కాదు ఎంత మందికి ఉపాధి కల్పించామన్నది ముఖ్యం. మంచిగా ఆలోచిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలి. ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది. ఇన్నోవేటివ్ గా పనిచేయగలగాలి. వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్లీ ఇది మన నినాదం కావాలి.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.


Also read

Related posts

Share via