June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పెంచుకునేందుకు తెచ్చి.. గొంతు కోసి పాడె కట్టి



నవ మాసాలు మోసింది లేదు.. పురిటి నొప్పులు భరించింది కాదు..కానీ అమ్మ అని పిలిపించుకుంది. తొమ్మిదేళ్ల పాటు పెంచిన అనుబంధం గుర్తుకు రాలేదు… ఆ తల్లిదండ్రులకు. ఆస్తిపై మక్కువతో పెంచిన కూతురినే కత్తితో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు.

అర్థవీడు, : నవ మాసాలు మోసింది లేదు.. పురిటి నొప్పులు భరించింది కాదు.. కానీ అమ్మ అని పిలిపించుకుంది. తొమ్మిదేళ్ల పాటు పెంచిన అనుబంధం గుర్తుకు రాలేదు…ఆ తల్లిదండ్రులకు. ఆస్తిపై మక్కువతో పెంచిన కూతురినే కత్తితో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ప్రాణాలు వదిలాక తమకేమీ తెలియనట్టు
భుజానికెత్తుకుని ఆర్తనాదాలు చేస్తూ ఆసుపత్రికి పరుగులు తీశారు. రక్తి కట్టించిన ఈ నాటకంలో చూపరులను కంటతడి పెట్టించినా.. పోలీసులకు మాత్రం దొరికిపోయారు. ఇద్దరూ ముద్దాయిలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

కంభం సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు కేసు వివరాలు వెల్లడించారు. అర్థవీడు మండల కేంద్రంలోని కుమ్మరవీధిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చకాయల వెంకట రమణారెడ్డి, ఆయన భార్య లక్ష్మీ పద్మావతికి పిల్లలు లేరు. దీంతో రాచర్ల మండలం అనులవీడులో ఉంటున్న రమణారెడ్డి తమ్ముడు వెంకట రంగారెడ్డి చిన్న కూతురైన శాన్విరెడ్డిని (9) తొమ్మిదేళ్ల క్రితం దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల అన్నదమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాక ఈ మధ్య కాలంలో శాన్విరెడ్డి కూడా కన్న తల్లిదండ్రులపై మమకారం చూపుతున్నట్లు గుర్తించిన సవతి తల్లి పద్మావతి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో చిన్నారిని అంతమొందించాలని వీరిద్దరూ పథకం రచించారు. ఈ నెల 6న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చరవాణి చూస్తూ పడక గదిలో ఉన్న చిన్నారిపై ముఖంపై పద్మావతి దిండు పెట్టి కత్తితో గొంతు కోసింది. కత్తిని మరుగుదొడ్లో దాచి రక్త స్రావం కాకుండా కర్చీపును సైతం అడ్డుపెట్టి దాన్ని పింగాణిలో పడేసింది. భర్త రమణారెడ్డి గేటు వద్ద కాపలా ఉండి ఇంట్లోకి ఎవరూ రాకుండా చూస్తూ సహకరించాడు. బయటి వ్యక్తులు ఎవరో చరవాణి కోసం చిన్నారిని హత్య చేసుంటారని బంధువులను నమ్మించాలని చూశారు. చిన్నారి ప్రాణాలు విడిచాక రమణారెడ్డి భుజానికి ఎత్తుకుని కేకలు వేస్తూ ప్రైవేటు వైద్యశాలకు పరుగులు తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ఆ వైద్యుడు తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఏమీ తెలియనట్లు దంపతులిద్దరూ కంటతడి పెట్టారు. చిన్నారి కన్న తండ్రి వెంకట రంగారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకట రమణారెడ్డి, పద్మావతిని అదుపులోకి తీసుకుని విచారించారు.. విచారణలో ఇద్దరూ చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో కంభం సీఐ రామకోటయ్య కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. 48 గంటల్లో కేసును చేధించిన సీఐ రామకోటయ్యను అర్థవీడు, కంభం,
బేస్తవారిపేట ఎస్సైలు అనిత, రాజేష్, నరసింహరావును డీఎస్పీ అభినందించారు.

Also read

Related posts

Share via