భౌమ ప్రదోష వ్రతం 2026: ఈరోజు వైశాఖ మాసపు చివరి ప్రదోష వ్రతం. మంగళవారం రోజున త్రయోదశి తిథి రావడంతో దీనిని ‘భౌమ ప్రదోషం’గా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శివారాధనతో పాటు హనుమంతుడిని పూజిస్తే రుణ విముక్తి కలగడమే కాకుండా కుజ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు
హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి విశిష్టమైన స్థానం ఉంది. నెలకు రెండుసార్లు వచ్చే ఈ త్రయోదశి తిథి పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారాన్ని జ్యోతిష్య భాషలో ‘భౌమ’ అని అంటారు, అందుకే దీనిని భౌమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ అరుదైన యోగం శివ భక్తులకు, ముఖ్యంగా కుజ దోషం లేదా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఒక వరప్రసాదం వంటిది.
ముహూర్తం, తిథి వివరాలు
వైశాఖ శుక్ల పక్ష త్రయోదశి తిథి ఏప్రిల్ 28, 2026 సాయంత్రం 6:51 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 29 సాయంత్రం 7:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి మరియు ప్రదోష కాల పూజను పరిగణనలోకి తీసుకుంటే, ఏప్రిల్ 28, మంగళవారం నాడే వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యాస్తమయ సమయమే ప్రదోష కాలం కాబట్టి, ఆ సమయంలో చేసే పూజకు అనంతమైన ఫలితం లభిస్తుంది.
భౌమ ప్రదోషం ప్రాముఖ్యత
సాధారణ ప్రదోషం కంటే భౌమ ప్రదోషం అత్యంత శక్తివంతమైనది. మంగళవారం హనుమంతుడికి కూడా ప్రీతికరమైన రోజు కావడంతో, ఈనాడు శివయ్యతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శత్రు భయం తొలగిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కోర్టు కేసులు మరియు భూ వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ‘రుణ విముక్తి’ కోసం ఈ రోజు చేసే పరిహారాలు త్వరగా ఫలిస్తాయని నమ్మకం.
పూజా విధానం
భౌమ ప్రదోషం నాడు ఉదయాన్నే స్నానం చేసి వ్రత సంకల్పం తీసుకోవాలి. రోజంతా ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవడం ఉత్తమం. సాయంత్రం ప్రదోష కాలంలో శివలింగానికి పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర) అభిషేకం చేయాలి.
శివునికి బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు, విభూతి మరియు గంధం సమర్పించాలి.
“ఓం నమః శివాయ” మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ శివ చాలీసా పఠించాలి.
పూజ అనంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంగళ దోష నివారణ జరుగుతుంది.
కష్టాల నుంచి గట్టెక్కించే 7 అద్భుత పరిహారాలు
ధన లాభం కోసం: శివలింగంపై పిడికెడు పచ్చి బియ్యం (విరగనివి) సమర్పించండి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
సంతాన సౌఖ్యం: గోధుమలు, ఉమ్మెత్త పువ్వులతో శివుడిని అర్చించండి.
అప్పుల విముక్తి: శివలింగంపై నువ్వుల నూనెతో అభిషేకం చేసి, హనుమాన్ చాలీసా పఠించండి.
ఆరోగ్యం కోసం: పాలలో నల్ల నువ్వులు, పటిక బెల్లం కలిపి అభిషేకం చేస్తూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
కుజ దోష నివారణ: శివలింగానికి జలాభిషేకం చేసిన తర్వాత ఎర్ర కందిపప్పు సమర్పించి ప్రార్థించండి.
కోరికలు నెరవేరాలంటే: ప్రదోష కాలంలో శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి, 21 బిల్వపత్రాలను సమర్పించండి.
మానసిక ప్రశాంతత: ధ్యానంలో ఉండి ప్రతికూల ఆలోచనలను వదిలి, ఏకాగ్రతతో శివ నామస్మరణ చేయండి.
ఈ పొరపాట్లు చేయకండి
ఈ వ్రతాన్ని ఆచరించే వారు అబద్ధాలు చెప్పడం, కోపతాపాలకు లోనుకావడం వంటివి చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం మంచిది. ముఖ్యంగా శివలింగంపై సింధూరం, పసుపు, తులసి దళాలు, మొగలి పువ్వులు మరియు కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించకూడదు.
