April 25, 2025
SGSTV NEWS
CrimeTelangana

Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ


బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీ విచారించనుంది. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీ విచారించనుంది.బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరు సినీనటులను పిలిచి విచారించారు.

పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌పై కేసు నమోదు చేశాక.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధుల్లోని ఠాణాలకు ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్‌ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో.. ఈ కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులు చాలా మంది విదేశీయులే..! చైనా కంపెనీల ప్రమేయం కూడా బయటపడుతోంది. నిర్వాహకులు రూ.వేల కోట్లను దేశం దాటించారు. యాప్స్‌ ప్రమోటర్లు– సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యూనరేషన్‌ చెల్లించారనే ఆరోపణలున్నాయి. దీంతో.. మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు, సైబర్‌క్రైమ్‌ కోణంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) ఇప్పటికే రంగంలోకి దిగగా.. ప్రభుత్వం అన్ని కేసులను కలిపి.. రాష్ట్ర స్థాయి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీఐడీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం

మియాపూర్‌ పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో పలువురు దిగ్గజ సినీ నటులు ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 19 బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించిన 25 మంది నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే..! ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచగా.. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, క్రైమ్స్‌ డీసీపీలు పక్కా ఆధారాలపై దృష్టిసారించాలని ఆదేశించినట్లు తెలిసింది. . దీంతో దర్యాప్తు అధికారులు.. ఏయే యాప్‌లను ఎవరెవరు ప్రమోట్‌ చేశారు? అందుకోసం వారికి దక్కిన ప్రతిఫలం ఎంత? అగ్రిమెంట్‌ వివరాలేంటి? అనే కోణంపై దృష్టిసారించారు. ఇప్పటి వరకు జంగిల్‌ రమ్మీ అనే యాప్‌ను రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌ ప్రమోట్‌ చేశారని, ఏ23 యాప్‌నకు విజయ్‌ దేవరకొండ, యోలో 24/7 యాప్‌ కోసం మంచు లక్ష్మి ప్రచారం కల్పించారని నిర్ధారించారు. 19 యాప్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత.. నిర్వాహకులు, ప్రమోటర్లను గుర్తించి, వారికి నోటీసులిచ్చి, విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది

మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు. అదేవిధంగా విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాళ్లలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు.

సిట్‌ ఏర్పాటు

బెట్టింగ్‌ యాప్స్‌పై విచారణకు ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌ పనిచేసేలా డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ (పీ అండ్‌ ఎల్‌) ఎం.రమేశ్‌ నేతృత్వంలోని సిట్‌లో.. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్‌ సభ్యులుగా ఉంటారు. సిట్‌ భవిష్యత్‌ అవసరాల మేరకు ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ), న్యాయ, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇతర విభాగాల నుంచి సహాయసహకారాలు పొందేలా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులను సిట్‌ విచారించనుంది. దీంతోపాటు.. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం, బెట్టింగ్‌ యాప్‌లను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి, పలు సూచనలతో ప్రభుత్వానికి మూడు నెలల్లో సమగ్ర నివేదికను అందజేయనుంది. సిట్‌ బృందం మంగళవారం డీజీపీ కార్యాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు పంజాగుట్ట, మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్లతోపాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్‌ యాప్‌లపై నమోదైన కేసులను ఈ సందర్భంగా విశ్లేషించనుంది.

మెట్రోకు బిగ్‌ షాక్‌

తాజాగా ఈ కేసులో హైదరాబాద్ మెట్రో రైలుకు కూడా గట్టి షాక్ తగిలింది. మెట్రో రైళ్లలోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారంటూ.. మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. న్యాయవాది నాగూర్‌బాబు ఈ పిల్ వేశారు. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన మెట్రో రవాణా సంస్థ ఇలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎస్, డీజీపీ, మెట్రో ఎండీతోపాటు ఈడీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈనెల 24కు తదుపరి విచారణను వాయిదా వేసింది

Also read

Related posts

Share via