July 3, 2024
SGSTV NEWS
Crime

అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు

• విజయవాడ నుంచి శిశువును తెప్పించి..

• రూ.4.5 లక్షలకు బేరం పెట్టిన ఆర్ఎంపీ

• సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు

• గుట్టురట్టు చేసిన స్వచ్ఛంద సంస్థ మహిళలు

• పీర్జాదిగూడలో వెలుగులోకి ఘటన

• ఆర్ఎంపీ సహా మరో ఇద్దరి అరెస్ట్

మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును  అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యత్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును 5.4.5 లక్షలకు కుదుర్చుకున్నారు.

ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధ్నాహ్నం విజయవాడ నుంచి తీసుకు వచ్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via